పవన్ కల్యాణ్ 10 కోట్ల భూరి విరాళం.. రైతు కూలీలు, వారే నాకు స్పూర్తి అంటూ జనసేనాని భావోద్వేగం!
సినీ నటుడు, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి భారీ విరాళాన్ని ప్రకటించారు. సినిమాల్లో నటించడం ద్వారా సంపాదించే ఆదాయం నుంచి రైతులకు, భవన నిర్మాణ కార్మికులకు, ఇతరులకు గతంలో భారీగా విరాళాలు స్వయంగా అందించిన విషయం తెలిసిందే. అలాగే పార్టీ నిర్వాహణ కోసం తన పిల్లల పేరు మీద చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా విడిపించి విరాళంగా అందించారు. తాజాగా ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నేతల అవసరాల కోసం భూరీ విరాళం ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..
స్వాతంత్ర్య ఉద్యమంలో సంపన్నులైన, బాగా డబ్బు సంపాదించిన లాయర్లు, మోతీలాల్ నెహ్రూ లాంటి వాళ్లు స్వార్జితంగా వచ్చిన డబ్బును ఉద్యమం కోసం ఖర్చు పెట్టారు. వారి స్పూర్తితోనే సినిమాల్లో సంపాదించిన డబ్బును పార్టీ కోసం ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాను. అందులో భాగంగానే 10 కోట్ల రూపాయలు పార్టీ ట్రెజరర్ ఏవీ రత్నంగారికి చెక్కు రూపంలో అందించాను అని పవన్ కల్యాణ్ చెప్పారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ, పార్టీని నడపడం డబ్బుతో కూడుకొన్న పని. పార్టీ కోసం చాలా మంది కూలీలు, బేల్దారీ మేస్త్రీ లక్ష రూపాయల విరాళం ప్రకటించారు. వారి నిస్వార్థ సహాయం నన్ను ప్రభావితం చేశారు. రోజుకు 500 రూపాయల కూలీ చేసే వారు పార్టీ కోసం 100 రూపాయలు విరాళంగా ఇవ్వడం, పార్టీకి బలంగా అండగా ఉన్నారు అని పవన్ కల్యాణ్ తెలిపారు.
పార్టీ కోసం రైతు కూలీలు అండగా నిలిచినప్పుడు నా వంతు కృష్టిగా ఈ సహాయం అందించాలని నిర్ణయించుకొన్నాను. గత నాలుగైదు సంవత్సరాల్లో 40, 50 కోట్ల రూపాయలు ఆదాయపు శాఖకు పన్ను రూపంలో చెల్లించాను. నా సంపాదనలో నుంచి 10 కోట్ల రూపాయలు మనస్పూర్తిగా అందిస్తున్నాను. ఈ విరాళం పార్టీకి అండగా ఉంటుందని విశ్వసిస్తున్నాను అని పవన్ కల్యాణ్ చెప్పారు.

జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు బీ మహేందర్ రెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్, పార్టీ నేతలు మర్రెడ్డి శ్రీనివాస్, పంచకర్ల సందీప్, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ ఆర్థిక సహాయంపై కార్యకర్తలు, అభిమానులు హర్షం ప్రకటిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపరం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ప్రచారాన్ని ఆ నియోజకవర్గం నుంచే చేపట్టేందుకు జనసేనాని సిద్దమయ్యారు. పిఠాపురం పర్యటనలో తొలి రోజు శక్తిపీఠమైన శ్రీ పురూహూతిక అమ్మవారి దర్శనం చేసుకొంటారు. అక్కడ వారాహి వాహనానికి పూజలు చేయిస్తారు. అనంతరం దత్తపీఠాన్ని దర్శిస్తారు. ఈ రోజు నుంచి మూడు రోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటారు. ఈ క్రమంలో పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు.


Click it and Unblock the Notifications











