జానీ సినిమా అందుకే ఫ్లాప్.. పవన్ కల్యాణ్ లీక్ చేసిన అసలు విషయం ఏమిటంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్లో జానీ సినిమా ప్రత్యేకమైనది. ఆయన తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి రూపొందించిన సినిమా అది. దాంతో ఆ మూవీపై భారీ అంచనాలు ఆ సమయంలో నెలకొన్నాయి. అయితే కథ, కథనాల్లో కమర్షియల్ వాల్యూస్ లేకపోవడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడం వెనుక కారణాన్ని వెల్లడించిన పవన్ కల్యాణ్ స్పీచ్ వీడియో వైరల్ అవుతున్నది. పవన్ చెప్పిన విషయాల్లోకి వెళితే..
మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్తో ప్రేమకథగా జానీ చిత్రం 2003 సంవత్సరంలో రూపొందింది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మించారు. రేణు దేశాయ్, రఘువరన్, బాలీవుడ్ నటుడు రజా మురాద్ నటించారు. ఈ సినిమాను సుమారుగా 10 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించారు.

అయితే పవన్ కల్యాణ్ నటించిన ఆరు సూపర్ హిట్ సినిమాల తర్వాత జానీ వచ్చింది. అంతేకాకుండా పవన్ కల్యాణ్ డైరెక్షన్ అనగానే.. అభిమానుల్లో అంచనాలు ఆకాశానికి అంటాయి. కానీ ఆఫ్ బీట్ స్టోరీ కావడంతో ప్రేక్షకులు, అభిమానులు పూర్తిగా నిరాశ చెందారు. దాంతో ఈ సినిమా డిజాస్టర్గా మారింది. ఆ విషయం గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..
జానీ సినిమా తీయాలని నిర్ణయించుకొన్నప్పుడు నాకు చిన్నప్పుడు చదువుకొన్న కథ గుర్తుకు వచ్చింది. నెల్లూరులో మా స్కూల్లో టీచర్ చెప్పిన నాన్ డీటైయిల్ స్టోరి టూ లీవ్స్ కథ నా మనసులో ఉండిపోయింది. ఆ కథ ఏమిటంటే.. ఒక అబ్బాయి చనిపోతూ.. మరో అమ్మాయిని బతికించిన స్టోరి. ఆ కథతో జానీ సినిమా చేయాలని నిర్ణయించుకొన్నాను అని పవన్ కల్యాణ్ అన్నారు.

జానీ కథ తయారు చేసేటప్పుడు రకరకాల అడ్డంకులు వస్తాయి. హీరోగా నేను చనిపోతాననే అంశాన్ని ఎవరూ ఒప్పుకోలేదు. ఆ కథను మార్చి మార్చి చేయడం వల్ల వేరే రకంగా మారడం వల్ల జానీ ఆడలేదు. ఆ వేదన నన్ను వెంటాడుతూనే ఉంటుంది అని పవన్ కల్యాణ్ ఇటీవల ఓ సభలో చెప్పిన విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నది.
డబ్బు, కమర్షియల్ వాల్యూని దృష్టిలో పెట్టుకోవడం వల్ల నేను అనుకొన్న సినిమాను తీయలేకపోయాను. కానీ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణలో గొప్పతనం ఏమిటంటే.. ఓ సామాజిక సమస్యను కూడా అందరికి నచ్చేలా తీస్తాడు. ప్రేక్షకులను మెప్పించడంలో ఆయనకు అరుదైన ప్రతిభ ఉంది. కమర్షియల్ వాల్యూస్ ఉంటూనే సామాజిక సమస్యను ప్రేక్షకులకు చెప్పడం ఆయనలో ఉన్న గొప్ప విషయం అని అన్నారు.


Click it and Unblock the Notifications











