రామోజీరావు నటించిన ఒక్క సినిమా ఏంటో తెలుసా? ఎలాంటి పాత్రను చేశారో తెలిస్తే!
సాధారణంగా ఎవరైనా ఒక వ్యక్తి తనదైన రంగంలో మాత్రమే రాణిస్తారు. కానీ, కొందరు మాత్రమే ఒకేసారి పలు విభాగాల్లో తనదైన ముద్రను వేసుకుని సక్సెస్ అవుతుంటారు. అలాంటి వారిలో రామోజీరావు ఒకరు. వ్యాపారవేత్తగా కెరీర్ను మొదలు పెట్టిన ఆయన.. ఆ తర్వాత పత్రికా అధిపతిగా, సినిమా నిర్మాతగా మారారు. ఈ అన్నింటిలోనూ తన మార్కును చూపించి సత్తా చాటుకున్నారు. అలాంటి ఈ లెజెండరీ పర్సన్ తాజాగా కన్నుమూశారు. 87 ఏళ్ల వయసులో రామోజీరావు అనారోగ్యం కారణంగా నేటి తెల్లవారుజామున తుదిశ్వాసను విడిచారు.
రామోజీరావు ఈ నెల 5వ తేదీన గుండెకు సంబంధించిన సమస్యతో ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో వైద్యులు చికిత్సను అందించారు. ఈ పరిస్థితుల్లో శనివారం తెల్లవారుజామున ఆయన పరిస్థితి విషమించింది. దీంతో రామోజీరావు ఈరోజు తెల్లవారుజామున ఆస్పత్రిలోనే తుదిశ్వాసను విడిచారు. ఆయన మరణంతో సినీ, రాజకీయ, పత్రికా, వ్యాపార రంగాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. దీంతో రామోజీరావుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

రామోజీరావు 1984లో వచ్చిన 'శ్రీవారికి ప్రేమలేఖ' అనే చిత్రంతో నిర్మాతగా మారారు. అక్కడి నుంచి ఆయన ఎన్నో రకాల జోనర్లలో సినిమాలను నిర్మించారు. ఇలా ఇప్పటి వరకూ 85 చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఈ దిగ్గజ నిర్మాత 'నువ్వే కావాలి' చిత్రానికి నేషనల్ అవార్డును అందుకున్నారు. అలాగే, నాలుగు ఫిల్మ్ఫేర్స్, ఐదు నంది అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. ఇలా నిర్మాతగా తనదైన రీతిలో ప్రభావాన్ని చూపించిన రామోజీరావు.. ఓ సినిమాలో సైతం నటించారు. ఆ సినిమా పేరు 'మార్పు'.
యూ విశ్వేశ్వర రావు దర్శకత్వంలో వచ్చిన 'మార్పు' అనే సినిమాలోనే రామోజీ రావు ఒక అతిథి పాత్రలో కనిపించారు. ఈ సినిమా 1978లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రామోజీరావు న్యాయమూర్తి పాత్ర పోషించారు. ఆయన ఇందులో చిన్న పాత్రనే చేసినా సినిమా పోస్టర్లలో సైతం ప్రచురించారు. ఇక, ఇదే చిత్రంలో నందమూరి తారక రామారావు సైతం ఓ గెస్ట్ రోల్ను చేశారు. దీంతో ఈ చిత్రం అప్పట్లో యమా హైలైట్ అయింది.


Click it and Unblock the Notifications











