వివాహంపై సాయి ధరమ్ తేజ్ సంచలన నిర్ణయం.. వచ్చే అమ్మాయి ఒప్పుకోదనే ఇలా.!
'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడే అయినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలని కష్ట పడుతుంటాడు. కెరీర్ ఆరంభంలో ఓ రేంజ్ ఫలితాలు వచ్చినా.. ఆ తర్వాత వరుస పరాజయాలు పలకరించాయి. అయినా.. ఈ మెగా వారి మేనల్లుడు వెనకడుగు వేయలేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. తాజాగా అతడి పెళ్లి గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్..? పూర్తి వివరాల్లోకి వెళితే...

వరుస ఫ్లాప్ల తర్వాత హిట్ ట్రాక్ ఎక్కాడు
వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి' అనే సినిమా ద్వారా మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. కిశోర్ తిరుమల తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో సాయి ధరమ్ సరసన కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ నటించారు. ఈ సినిమాతో ఈ మెగా హీరోలో ఎనర్జీ పెరిగిపోయిందనే చెప్పాలి.

తాతతో కలిసి పండుగ చేస్తాడట
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.. మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే' అనే సినిమాలో నటించాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాస్ నిర్మించిన ఈ సినిమాలో తేజూ సరసన రాశీ ఖన్నా నటించింది. తాతా మనవడు సెంటిమెంట్తో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సోలో బతుకే సో బెటరు అంటున్నాడు
‘ప్రతిరోజూ పండగే' తర్వాత సాయి ధరమ్ తేజ్ ‘సోలో బతుకే సో బెటరు' అనే సినిమాను చేస్తున్నాడు. దీనిని సుబ్బు అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. భోగవిల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తేజూ సరసన నభా నటేష్ నటిస్తోంది. ఇందులో అమ్మాయిలను హేట్ చేసే యువకుడిగా కనిపించబోతున్నాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్.

వివాహంపై సాయి ధరమ్ తేజ్ సంచలన నిర్ణయం
సాయి ధరమ్ తేజ్.. తన వివాహం విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడని తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అతడు వివాహం చేసుకోకూడదని డిసైడ్ అయ్యాడట. దీనికి కారణం సోషల్ సర్వీస్ చేయాలన్న ఆలోచనే అని సమాచారం. పెళ్లైతే వచ్చే అమ్మాయి ఆ పనులకు అడ్డుపడుతుందనే తేజూ ఇలా డిసైడ్ అయ్యాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ, మెగా ఫ్యాన్స్ మాత్రం అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇప్పటికే చాలా చేశాడు.. చేస్తున్నాడు
సాయి ధరమ్ తేజ్ అప్పుడప్పుడూ కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇటీవల ఓ స్కూలును దత్తత తీసుకున్నాడు. కొంత మంది పిల్లలను చదివిస్తానని, వాళ్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నానని తేజూ వెల్లడించాడు. అంతేకాదు, త్వరలోనే మరో 50 మంది పిల్లలను దత్తత తీసుకుంటానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

నిహారికతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికను సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీటికి కొద్ది రోజుల క్రితం అతడే స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ‘నిహారిక నాకు చెల్లి లాంటిది. చిన్నప్పటి నుంచి మేము అలాగే పెరిగాం. ఆ వార్తలు రాసే వాళ్లు కొంచెం ఆలోచించాలి. అయినా చెల్లిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా' అంటూ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











