‘నా దేశం వైపు కన్నెత్తి చూస్తే.. గుడ్లు పీకేస్తాం’.. జై హో అంటూ కంగన, సల్మాన్, రజనీ, రాంచరణ్
పాకిస్థాన్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద క్యాంపులపై భారత్ నిర్వహించిన వైమానిక మెరుపు దాడులపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. పుల్వామా ఉగ్రదాడితో అట్టుడికిపోతున్న దేశ ప్రజల మనోభావాలకు ఈ మెరుపు దాడులు ఉపశమనంగా మారాయి. ఈ మెరుపు దాడులపై సినీ నటులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వారిలో సల్మాన్ ఖాన్, కంగన రనౌత్, రజనీకాంత్, కమల్ హాసన్ తదితరులు ఉన్నారు. వారేమన్నారంటే..

జైహో అని సల్మాన్ ఖాన్
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం అలీ అబ్బాస్ జాఫర్ రూపొందిస్తున్న భరత్ అనే సినిమా షూటింగ్లో ఉన్నారు. మెరుపు దాడులు జరిగిన వెంటనే సోషల్ మీడియాలో స్పందించారు. దేశ వైమానిక దళ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. పాక్లో దాడులు చేసిన ఇండియన్ ఎయిర్ఫోర్స్ను గౌరవిస్తాను. జైహో అంటూ ట్వీట్ చేశారు.

కన్నేస్తే.. గుడ్లు పీకేస్తాం: కంగన
పాక్పై సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత భారతీయ రక్షణ దళాలు, ప్రధాని మోదీపై కంగన రనౌత్ ప్రశంసల వర్షం కురిపించింది. నిజమైన హీరోల మాదిరిగా దాడులు చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సెల్యూట్ చేస్తున్నాను. సాహసోపేతమైన నిర్ణయం తీసుకొన్నందుకు ప్రధానికి థ్యాంక్స్. ఉగ్రవాదంపై పోరు మొదలైందనే సందేశం స్పష్టంగా వినిపించాం. నా దేశంపై చెడుగా కన్నెస్తే.. ఆ గుడ్లనును పెకిలించి పడేస్తాం... జైహింద్ అని కంగన రనౌత్ వెల్లడించింది.

బ్రేవో ఇండియా అంటూ రజనీకాంత్
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ కూడా సర్జికల్ స్ట్రయిక్స్పై తన గళాన్ని వినిపించారు. భారత సేనల పరాక్రమాన్ని కొనియాడారు. బ్రేవో ఇండియా అంటూ ట్వీట్ చేశారు. పాకిస్థాన్లోని ఉగ్రవాద క్యాంపులపై మెరుపుదాడులు చేసినందుకు అభినందనలు తెలిపారు.

ఇంతకంటే మంచి రోజు ఏముంటుంది?
పాకిస్థాన్లోని టెర్రరిస్ట్ క్యాంపులపై వైమానిక దాడులను అనుపమ్ ఖేర్ స్వాగతించారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ పైలెట్లకు నా సెల్యూట్ అని రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ను రీట్వీట్ చేస్తూ.. ప్రధానికి సెల్యూట్ చేయడానికి ఇంతకంటే మంచిరోజు ఏముంటుంది అని అన్నారు.

గర్వంగా ఉందని అక్షయ్ ట్వీట్
పాకిస్థాన్లో ఉగ్ర క్యాంపులను ధ్వంసం చేసిన ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఫైటర్లను చూస్తే గర్వంగా ఉంది. ఇక ఉపేక్షించకండి.. ఇండియా స్ట్రయిక్ బ్యాక్ అనే హ్యాష్ ట్యాగ్తో అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు.

వైమానిక దాడులు భేష్
భారత వైమానిక దళాలు జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్పై మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్పందించారు. వైమానిక దళం దాడుల గురించి తెలిసిన తర్వాత గర్వంగా ఉంది. జై హింద్ అని ట్వీట్ చేశారు.

రాజీలేని పోరాటానికి నా సెల్యూట్
ఆక్రమిత పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన భారత వైమానిక దళంపై నటుడు సంజయ్ దత్ ప్రశంసలు కురిపించారు. దేశ సురక్షితం కోసం రాజీలేని పోరాటం చేసిన ఇండియన్ ఎయిర్ఫోర్స్కు నా సెల్యూట్. సైనికుల భద్రత కోసం దేవుడిని ప్రార్థిస్తాను. జైహింద్ అంటూ సంజయ్ దత్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











