Telugu Warriors: CCL లో చేతులెత్తేసిన తెలుగు వారియర్స్.. భోజ్పురి దబాంగ్స్ ఘన విజయం
సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో భాగంగా వైజాగ్లో జరిగిన తొలి మ్యాచ్లో తెలుగు వారియర్స్ జట్టు ఘోరమైన ఓటమిని చవిచూసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకొన్న అఖిల్ అక్కినేని జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగంలో దారుణంగా విఫలమయ్యారు. దాంతో భోజ్పురి జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళితే..
టాస్ కోల్పోయి బ్యాటింగ్ చేపట్టిన భోజ్పురి దబాంగ్స్ జట్టుకు తొలి ఓవర్లోనే భారీ దెబ్బ తగిలింది. తొలి బంతినే బౌండరీకి తరలించిన కెప్టెన్ మనోజ్ తివారీ.. రెండో బంతిని భారీ షాట్కు ప్రయత్నించి అవుటయ్యాడు. రఘు వేసిన బంతిని బౌండరీకి తరలించే ప్రయత్నంలో అఖిల్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. దాంతో 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.

ఆ తర్వాత టాప్ ఆర్డర్ సమన్వయంతో ఆడుతూ బోర్డు మీద స్కోరును పరుగులు పెట్టించారు. ఓపెనర్ రామ్ పర్వేశ్ యాదవ్ 34 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత అజయ్ ఓజా, అస్గర్ ఖాన్ జట్టును స్కోరును పెంచుతూ బాధ్యతాయుతంగా ఆడారు. ఓజా 23 పరుగులు, అస్గర్ ఖాన్ 60 పరుగులు చేసి అవుటయ్యారు.
ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో భోజ్పురి జట్టు 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. తెలుగు వారియర్స్ బౌలర్లలో సచిన్ జోషి 2 వికెట్లు, రఘు, సమ్రాట్, వినయ్ చెరో వికెట్ పడగొట్టారు. .
159 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన తెలుగు వారియర్స్ జట్టు 18.1 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో భోజ్పురి దబాంగ్స్ జట్టు 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. తెలుగు వారియర్స్ జట్టులో అత్యధికంగా వినయ్ మహాదేవ్ 27 పరుగులు, సుధీర్ బాబు 26 పరుగులు, అశ్వీన్ బాబు 15, అఖిల్ అక్కినేని 12 పరుగులు, సమ్రాట్ రెడ్డి 10 పరుగులు చేశారు. భోజ్పురి జట్టులో కెప్టెన్ మనోజ్ తివారీ 3 వికెట్లు, రాజీవ్ రిషి 2 వికెట్లు, విక్రాంత్, అస్గర్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.


Click it and Unblock the Notifications











