CCL 2026: చిత్తు చిత్తుగా ఓడిన తెలుగు వారియర్స్.. కర్ణాటక బుల్డోజర్స్ ఘన విజయం
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2026 టోర్నమెంట్లో భాగంగా కోయంబత్తూరులోని ఎస్ఎన్ఆర్ కాలేజీ క్రికెట్ స్టేడియంలో తెలుగు వారియర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కర్ణాటక బుల్డోజర్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కేవలం ఒకే వికెట్ కోల్పోయి విజయలక్ష్యాన్ని చేరుకొన్న కర్ణాటక జట్టు 9 వికెట్ల తేడాతో తెలుగు జట్టును చిత్తు చిత్తుగా ఓడించింది. అయితే భారీ స్కోరుతో తెలుగు వారియర్స్ విసిరిన సవాల్ను కిచ్చ సుదీప్ జట్టు సునాయసంగా స్వీకరించి గెలుపును సాధించింది. ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళితే..
టాస్ గెలిచిన కర్ణాటక బుల్డోజర్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తెలుగు వారియర్స్ జట్టు బ్యాటింగ్ చేపట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఇవ్వడం తప్పనే విధంగా తెలుగు జట్టు బ్యాటింగ్తో అదరగొట్టింది. ఓపెనర్ అశ్విన్ బాబు కేవలం 69 బంతుల్లో 8 సిక్సర్లు 11 ఫోర్ల సహాయంతో 132 పరుగులు చేశాఢు. ఆ తర్వాత అఖిల్ అక్కినేని 35 బంతుల్లో 44 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు.

తెలుగు వారియర్స్ టీమ్ తొలి వికెట్కు అశ్విన్, అఖిల్ 103 పరుగులు జోడించారు. ఆ తర్వాత రెండో వికెట్కు ప్రిన్స్తో కలిసి 87 పరుగులను అశ్విన్ జోడించాడు. ఆ తర్వాత వచ్చిన ప్రిన్స్, థమన్, సమ్రాట్ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో తెలుగు వారియర్స్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. కర్ణాటక బౌలర్లలో ప్రదీప్ బోగడి, చందన్ కుమార్, కరణ ఆర్యన్, అరుణ్ బచ్చన్ చెరో వికెట్ పడగొట్టారు.
తెలుగు వారియర్స్ విసిరిన 226 పరుగుల భారీ లక్ష్యంతో కర్ణాటక బుల్డోజర్స్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్ ప్రదీప్, రాజీవ్ హను ధాటిగా బ్యాటింగ్ చేశారు. తొలి వికెట్కు 134 పరుగులు జోడించారు. 64 పరుగులు చేసిన ప్రదీప్ (33 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) అఖిల్ క్యాచ్ పట్టగా వినయ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రాజీవ్, డార్లింగ్ కలిసి విజయానికి కావాల్సిన పరుగులను పూర్తి చేశారు. రాజీవ్ 107 (53 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లు) పరుగులతో, డార్లింగ్ కృష్ణ 43 (20 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులతో నాటౌట్గా నిలిచారు.
అయితే భారీ పరుగుల ఛేదనలో కర్ణాటక జట్టు ఎక్కడా తడబాటుకు గురి కాలేదు. 227 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 16 బంతులు ఉండగానే చేరుకొన్నారు. రాజీవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాన్గా నిలిచారు. ఈ విజయంతో కర్ణాటక జట్టు సెమీఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకొన్నది. కర్ణాటక జట్టు 2 మ్యాచులు ఆడి 2 మ్యాచుల్లో విజయం సాధించి నాలుగు పాయింట్లతో రెండోస్థానంలో నిలిచింది. తెలుగు వారియర్స్ జట్టు 3 మ్యాచులు ఆడి 1 మ్యాచులో విజయం, రెండు మ్యాచుల్లో ఓటమి పాలై 2 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది.


Click it and Unblock the Notifications











