CCL 2025 : నాగార్జున వస్తే అదే జరుగుతుంది .. తెలుగు వారియర్స్ ఓనర్ సచిన్ జోషి
సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్ 2025) సినీ, క్రీడా అభిమానులకు మంచి ఆనందాన్ని అందిస్తోంది. ఫిబ్రవరి 8న ప్రారంభమైన ఈ సీజన్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్లు జరగ్గా కర్ణాటక బోల్డోజర్స్ 2, బెంగాల్ టైగర్స్ 2, భోజ్పురి దబాంగ్స్ 2, తెలుగు వారియర్స్ 2, పంజాబ్ దే షేర్ 1, చెన్నై రైనోస్ 2, ముంబై హీరోస్ ఒక మ్యాచ్ ఆడాయి. కర్ణాటక బుల్డోజర్స్ , బెంగాల్ టైగర్స్ ఆడిన రెండింటిలోనూ విజయం సాధించాయి. అయితే +2.139 రన్ రేట్తో పాయింట్ల పట్టికలో కర్ణాటక టాప్లో నిలిచింది.
ఇక అఖిల్ అక్కినేని సారథ్యంలోని తెలుగు వారియర్స్ జట్టు విషయానికి వస్తే నాలుగు సార్లు ఈ మెగా టైటిల్ను గెలిచిన రికార్డు మన జట్టు సొంతం. ఐదోసారి కూడా గెలుస్తామని కెప్టెన్ అఖిల్ ఇప్పటికే స్పష్టం చేశాడు. జట్టులో ప్రతిభావంతులకు కొదవ లేదు. కర్ణాటక బుల్డోజర్స్తో జరిగిన తొలి మ్యాచ్ను చేజేతులా కోల్పోయింది తెలుగు వారియర్స్. నిర్లక్ష్యపూరితమైన షాట్లు, చెత్త ఫీల్డింగ్తో తొలి మ్యాచ్ను సుదీప్ సేనకు కోల్పోయింది అఖిల్ జట్టు.

పరువు నిలబెట్టుకోవాల్సిన దశలో ఫిబ్రవరి 14న హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భోజ్పురి దబాంగ్స్తో తలపడింది తెలుగు వారియర్స్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఖిల్ సేన తొలి ఇన్నింగ్స్లో 80 పరుగులు చేయగా.. భోజ్పురి జట్టు 126 పరుగులు చేసింది . అనంతరం బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్ 132 పరుగులు చేసింది. 87 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భోజ్పురి దబాంగ్స్ 9.5 ఓవర్లలో 79 పరుగులకు ఆలౌటైంది. దీంతో అఖిల్ సేన 7 పరుగుల తేడాతో విజయం సాధించి తెలుగు గెలుపు అందుకుంది.
రెండు మ్యాచ్లలో ఒక విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది తెలుగు వారియర్స్. -0.975 రన్రేట్తో ఈ విషయంలోనూ నాలుగో స్థానంలో నిలిచింది. శనివారం హైదరాబాద్లో చైన్నై రైనోస్తో తలపడనుంది అఖిల్ సేన. భోజ్పురి జట్టుతో చూపిన పోరాట పటిమనే కొనసాగించి పాయింట్ల పట్టికలో దూసుకెళ్లాలని తెలుగు వారియర్స్ భావిస్తోంది. అయితే చెన్నై వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోవడంతో పరువు కోసం గట్టిగా పోరాడాలని నిర్ణయించుకుంది. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.
ఇదిలాఉండగా.. భోజ్పురి జట్టుపై విజయం సాధించిన అనంతరం తెలుగు వారియర్స్ ఓనర్ సచిన్ జోషి ఫిల్మీబీట్తో ప్రత్యేకంగా మాట్లాడారు. సెలబ్రెటీ క్రికెట్ లీగ్ అద్భుతంగా సాగుతోందని.. అన్ని జట్లు బాగా ఆడుతున్నాయని చెప్పారు. ఐపీఎల్తో పోలిస్తే సీసీఎల్లో ఆడటం కష్టమని సచిన్ జోషి అన్నారు. సీసీఎల్ ఫార్ములా సచిన్ టెండుల్కర్కు ఎంతో నచ్చిందని.. పలుమార్లు దీనిపై ప్రస్తావించినట్లు జోషి తెలిపారు. కింగ్ అక్కినేని నాగార్జున మా లక్కీ చాంప్ అన్న ఆయన.. నాగ్ మమ్మల్ని ప్రోత్సహించడానికి వచ్చినప్పుడల్లా తెలుగు వారియర్స్ గెలుస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సచిన్ జోషి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











