హరిహర వీరమల్లును అడ్డుకొంటారా? పవన్ కల్యాణ్ మూవీపైనే కుట్రనా? ఆ నలుగురిపై సినీ వర్గాల ఆగ్రహం
తెలుగు సినిమా పరిశ్రమలో పర్సంటేజీ విధానంలో డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లకు చెల్లించే అద్దె, కమిషన్ విషయం భారీ వివాదానికి తెర లేపడమే కాకుండా నిర్మాతలను ఆందోళనకు గురి చేస్తున్నది. పర్సంటేజీ పద్దతిలో చెల్లింపులు జరగకపోతే జూన్ 1వ తేదీ నుంచి సింగిల్ థియేటర్లను మూసివేస్తామని ఇండస్ట్రీలోని కొందరు టాప్ డిస్టిబ్యూటర్లు హెచ్చరించడం అత్యంత వివాదంగా మారింది. ఈ వివాదంతో జూన్లో విడుదలకు సిద్దమవుతున్న థగ్ లైఫ్, హరిహర వీరమల్లు, కుబేరా, కన్నప్ప లాంటి సినిమా నిర్మాతలు తీవ్రమైన ఆందోళనకు గురి అవుతున్నారు. ఈ విషయం గురించి పలువురు నిర్మాతలు, సినీ వర్గాలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. సినిమా పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నాలపై సినీ వర్గాలు తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ..
థియేటర్ల మూసివేత ఎందుకు?
పర్సంటేజీ విధానం అనే అంశాన్ని అడ్డుగా పెట్టుకొని ఆంధ్రా, నైజాం ప్రాంతాల్లో సింగిల్ థియేటర్లను మూసివేస్తాం అనే సమస్య ఎందుకు వచ్చింది? ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించకపోగా.. దానికి అడ్డుపడుతున్న వారి అసలు ఎజెండా ఏమిటి? తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖులుగా గుర్తింపు పొందిన వారు ఎవరి జెండాను వారు మోస్తున్నారు. తమ సినిమాల విడుదల సమయంలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరలను పెంచుకొనేందుకు పాట్లు పడే ఆ నలుగురు ఎజెండా ఏమిటనే ప్రశ్నను కొందరు మధ్య, చిన్న, భారీ నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ప్రశ్నిస్తున్నారు.
కలిసికట్టుగా రమ్మని అంటే..
తెలుగు సినిమా పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇండస్ట్రీలోని భాగస్వాములందరూ కలిసికట్టుగా రావాలని ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలోని దిల్ రాజు, సురేశ్ బాబు, అల్లు అరవింద్, సి.అశ్వనీదత్, సుప్రియ పలువురు ప్రభుత్వ పెద్దలని కలిశారు. ఆ సమయంలో ఇండస్ట్రీకి ఎలాంటి అవసరం కావాల్సి వచ్చినా సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ను కలువండి సూచించారు. అయితే ప్రభుత్వ సలహాలను పాటించకుండా, సమిషిగా కాకుండా ఎవరి సినిమా ప్రయోజనాల కోసం వారు వ్యక్తిగతంగా వెళ్లడం ఏమిటనే విషయంపై ఓ నిర్మాత ప్రశ్నల వర్షం కురిపించారు.
గుత్తాధిపత్యానికి బీటలు పడుతాయా?
సినిమా పరిశ్రమ అభివృద్దికి, టికెట్ రేట్ల పెంపుకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగా ఉంది. టికెట్ రేట్లు పెంచడం వల్ల, జీఎస్టీ విధింపు వల్ల సర్కారుకు ఆదాయం చేకూరుతుంది అని గేమ్ ఛేంజర్ వేడుకలో పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఏపీ ప్రభుత్వ సానుకూలంగా ఉన్నప్పటికీ.. సినీ పెద్దలు ముఖ్యంగా ఆ నలుగురు చొరవ చూపకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీపై ఉండే వారి గుత్తాధిపత్యానికి గండి పడుతుందా? అనే భయం వారికి ఉందా? అందుకే సినీ పరిశ్రమ అభివృద్ధికి మోకాలు అడ్డుతున్నారా? అంటూ అని కొందరు నిర్మాతలు నిలదీస్తున్నారు.
ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టే చర్యలా?
కూటమి ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్దికి సహకారం అందించడానికి సిద్దంగా ఉన్నప్పటికీ.. ఇండస్ట్రీలోని కొందరు నిర్మాతల కూటమి ముఖ్యంగా ఆ నలుగురు ఎందుకు చొరవ తీసుకోవడం లేదు? గత ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దల ముందు చేతులు కట్టుకొని నిలబడిన వారే ఇలాంటి చర్యలు చేపట్టడం వెనుక అసలు మతలబు ఏమిటి? నలుగురు నిర్మాతల సిండికేటుగా ఏర్పడి హీరోలు, నిర్మాతలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం ఎందుకు? అని కొందరు నిర్మాతలు నిలదీస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నటించిన హరిహర వీరమల్లు సినిమాకే అడ్డంకులు కల్పించడానికి కుట్రలు పన్నుతున్నారా? అనే అనుమానం బలంగా మారుతున్నది అని ఓ నిర్మాత ఆవేదన వ్యక్తం చేశాడు.

పవన్ కల్యాణ్పైనే కుట్రలా?
తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి స్వచ్ఛందంగా, స్వలాభాపేక్ష లేకుండా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తుంటే? ఆయన ప్రయత్నాలకు వ్యతిరేకంగా తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారు. నాలుగేళ్లు అనేక అడ్డంకులు, సమస్యలను ఎదుర్కొని.. అలాగే విలువైన సమయాన్ని వెచ్చించి హరిహర వీరమల్లు సినిమాను రిలీజ్ చేస్తుంటే.. ఆ ప్రయత్నాలకు కొందరు అడ్డుకొంటూ నిర్మాత ఏఎం రత్నంను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి కుతంత్రాలు ఏపీ ప్రభుత్వ సంకల్పానికి, డిప్యూటీ సీఎం తపనను అవమానించడమే అవుతుంది. ఇండస్ట్రీపై బతికే కళాకారులు, సాంకేతిక నిపుణులు, 24 విభాగాల కార్మికులు జీవితాలను సమస్యల్లోకి నెట్టడమే అవుతుంది అని కొందరు నిర్మాతలు ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా ఇలాంటి విధానాలను పక్కన పెట్టి.. సినీ పరిశ్రమ అభివృద్ధికి పాటుపడాలని వారు హితవు పలుకుతున్నారు.


Click it and Unblock the Notifications











