2020లో బోసిపోయిన బాక్సాఫీస్.. థియేటర్లు వెలవెల.. ఓటీటీ గలగల
కరోనా వైరస్ వల్ల 2020లో అన్ని రంగాలు దారుణమైన ఫలితాలను చూసింది. మునుపెన్నడూ చూడని నష్టాలను చవిచూసింది. అందులో అన్నింటికంటే ముఖ్యంగా సినీ పరిశ్రమ కోలుకోలేనంత కుంగిపోయింది. మన టాలీవుడ్కు 2020 కలిసి వస్తుందని, సంక్రాంతి రేసులో దిగిన రెండు పెద్ద సినిమాలు దాదాపు 400 కోట్ల బిజినెస్ చేశాయని అందరూ సంబరపడ్డారు. ఇక ఈ ఏడాదికి తిరుగులేదని అందరూ సంబరపడ్డారు. కానీ అప్పుడే అసలు కథ మొదలైంది.

సంక్రాంతి హిట్..
సంక్రాంతి సీజన్ అంటే టాలీవుడ్కు పెద్ద పండుగ. దానికి తగ్గట్టే 2020 సంక్రాంతి పోరులో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో.. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో దిగారు. ఈ రెండు కూడా బాక్సాఫీస్ మీద దాడి చేశారు. ఈ రెండూ కలిసి దాదాపు నాలుగు వందలకు పైగా గ్రాస్ కొల్లగొట్టింది. మరీ ముఖ్యంగా అల వైకుంఠపురములో అయితే ఓవర్సీస్లో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

దెబ్బ మొదలైంది..
ఫిబ్రవరి నెలలో విడుదలై భీష్మ సినిమా బాగానే క్లిక్ అయింది. వరల్డ్ ఫేమస్ లవర్ నిరాశ పరిచినా.. భీష్మ ఆదుకుంది. ఫిబ్రవరి మొత్తం భీష్మ హవా నడిచింది. ఇక మార్చి నెలలోకి ఎంటరయ్యే సరికి అసలు సమస్య వచ్చింది. అప్పటికే ఎన్నో సినిమాలు లైన్లోకి వచ్చాయి. మార్చి నెలలో కరోనా వైరస్ సోకడం మొదలుపెట్టింది. మెల్లిమెల్లిగా హెచ్చరికలు రావడం మొదలయ్యాయి.

పూర్తిగా షట్ డౌన్..
ఇక మార్చి నెల చివరి నుంచి ఇప్పటి వరకు బాక్సాఫీస్ వెలవెలబోతూనే ఉంది. ఇప్పటికి కూడా థియేటర్లు అన్ని చోట్లా ప్రారంభించలేదు. థియేటర్లలో జనాలు లేక అనాథలా ఎదురుచూస్తున్నాయి. టిక్కెట్లు తెగక క్యాంటిన్ బిక్కమొహం వేసుకుని కూర్చుంది. ఇలా థియేటర్లు మొత్తం శిథిలావస్థకు వచ్చేలా తయారయ్యాయి.

ఓటీటీ హవా..
లాక్డౌన్ మూలానా వినోదం కరువైన ప్రేక్షకుడికి ఓటీటీ ఊపిరి పోసింది. ఒక్కసారిగా ఓటీటీ ప్రపంచం ఊపందుకుంది. దాదాపు నాలుగైదు నెలలు ఇంటి గడప దాటి బయటకు రాలేనటు వంటి పరిస్థితిలో ఓటీటీ ఆదుకుంది. థియేటర్లలో సినిమా చూసే వీలు లేదని గమనించిన సినీ అభిమానులు ఓటీటీని ఆశ్రయించారు. దర్శక నిర్మాతలు కూడా ఓటీటీ వైపు చూశారు.

చిన్న సినిమాలకు ఆదరణ..
ఓటీటీ ఫ్లాట్ఫాం వల్ల చిన్న సినిమాలకు ఆదరణ లభించాయి. కంటెంట్ ఉన్న సినిమాలకు మౌత్ టాక్ వల్ల పబ్లిసిటీ పెరిగింది. ఓటీటీపై హిట్గా నిలిచిన చిన్న సినిమాలెన్నో ఉన్నాయి. అయితే పెద్ద సినిమాలను ఓటీటీలో విడుదల చేసేందుకు మాత్రం ఎవ్వరూ ముందుకు రాలేదు.

వారికి మాత్రం లాభం..
ఓటీటీలో చిన్న సినిమాలు విడుదల చేయడంతో నిర్మాతలకు మాత్రం ఎలాంటి నష్టాలు వాటిల్లలేదు. వారు పెట్టిన రూపాయి వారి చేతుల్లోకి వెళ్లినట్టైంది. అలా ఈ ఏడాది కృష్ణ అండ్ హిజ్ లీల, భానుమతి రామకృష్ణ, జోహర్, కలర్ పోటో, అనగనగా ఓ అతిథి వంటి చిత్రాలెన్నో మంచి విజయాలను అందుకున్నాయి. వాటితో పాటు పెంగ్విన్, నిశ్శబ్దం, మిస్ ఇండియా సినిమాలు కూడా విడుదలయ్యాయి. వాటికి అంత పాజిటివ్ టాక్ రాకపోయినా కూడా నిర్మాతలకు మాత్రం నష్టాలను మిగల్చేదని టాక్.


Click it and Unblock the Notifications











