రాజమౌళిని ఢీకొట్టగల సత్తా ఈ నలుగురికి ఉందా..?
ఎస్ఎస్ రాజమౌళి.. ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ను దాటేసి బాలీవుడ్ మీదుగా హాలీవుడ్ రేంజ్లో వినిపిస్తోంది. ఇన్నేళ్ల కెరీర్లో ఓటమి ఎరుగని దర్శకుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని భారతదేశానికి చాటి చెప్పిన ఆయన.. ఆర్ఆర్ఆర్తో ప్రపంచస్థాయికి తీసుకెళ్లి ఆస్కార్ అవార్డ్ను సైతం ముద్దాడిన డైరెక్టర్గా నిలిచారు. హీరోలకు స్టార్ ఇమేజ్ రావాలంటే ఖచ్చితంగా రాజమౌళి చేతుల్లో పడాల్సిందేనన్న ఘనత సాధించారు. ఆయన సాధించిన విజయాలు, రికార్డులను మరో దర్శకుడు బీట్ చేయగలరా అన్న చర్చ నిత్యం ఎక్కడో ఓ మూల జరుగుతూనే ఉంటుంది. దటీజ్ రాజమౌళి.
కానీ రికార్డులున్నది బద్ధలు కొట్టడానికేనని పెద్దలు చెబుతూ ఉంటారు. రాజమౌళీని అందుకోగల దర్శకులు మన తెలుగునాట ఉన్నారు. జక్కన్న బాటలోనే నడుస్తూ.. ఇండియన్ బాక్సాఫీసును శాసించడానికి రెడీ అవుతున్నారు. వారిలో మొదట వినిపించే పేరు నాగ్ అశ్విన్. మహానటి మూవీతో బయోపిక్లకు సరికొత్త బెంచ్ మార్క్ పెట్టిన ఆయన ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో తెరకెక్కిస్తోన్న 'కల్కి 2898 ఏడీ ''పై భారీ అంచనాలున్నాయి. భారతీయ పురాణాలు, సైన్స్ ఫిక్షన్ మేళవింపుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్, రీసెంట్గా 'బుజ్జి ' పరిచయ కార్యక్రమాలతో నాగ్ అశ్విన్.. కల్కి ద్వారా రాజమౌళిని మించిపోయేలా ఉన్నాడు. ఈ సినిమా టాలీవుడ్ రేంజ్ని మరో స్థాయికి తీసుకెళ్తుందని అంతా గట్టి నమ్మకంతో ఉన్నారు. టెక్నాలజీ, కాస్ట్యూమ్స్, డైలాగ్స్, ఎలివేషన్స్ విషయంలో నాగ్ అశ్విన్ని గుర్తుచేస్తున్నాడు.

తెలుగునాట క్రియేటివ్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్.. పుష్ప మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్టులో స్థానం సంపాదించాడు. పుష్పలో సుక్కూ మార్క్ క్రియేటివిటికీ దేశం పులకించిపోయింది. ఎలాంటి యానిమేషన్స్, విజువల్ ఎఫెక్ట్స్ లేకుండానే పుష్పను తన మ్యాజిక్తో బ్లాక్బస్టర్గా నిలబెట్టారు సుకుమార్. పుష్ప క్లైమాక్స్లో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్కి పుష్పతో సవాల్ విసిరి, సెకండ్ పార్ట్పై బజ్ క్రియేట్ చేయడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు సుకుమార్. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా పుష్ప-2 రిలీజ్ కానుంది. ఈ సినిమా ఘన విజయం సాధిస్తే సుకుమార్ స్థాయి మరింత పెరగడం ఖాయం.
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ చరిత్రని మార్చేసిన సందీప్ రెడ్డి వంగా రాత్రికి రాత్రే స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు. ఇదే సినిమాని కబీర్ సింగ్ పేరుతో హిందీలో రీమేక్ చేసి అక్కడా జెండా పాతాడు. ఆ వెంటనే బాలీవుడ్ యువ సూపర్స్టార్ రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన 'యానిమల్' సంచలనం సృష్టించింది. బోల్డ్ కంటెంట్ను కరెక్ట్ వేలో చూపిస్తూ.. ఆడియన్స్ను మెప్పించడం ఒక్క సందీప్ రెడ్డికే సాధ్యమైందని చెప్పాలి. రామ్ గోపాల్ వర్మలా సినిమా మేకింగ్ స్టైల్నే మార్చేసి ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు సందీప్.
అంతేకాదు.. ఏ డైరెక్టర్ సాహసించని విధంగా సినిమాలు తీస్తూ దూసుకెళ్తున్నాడు. త్వరలో రెబల్స్టార్ ప్రభాస్ను డైరెక్ట్ చేయనున్న 'స్పిరిట్'పై భారీ అంచనాలున్నాయి. ఇందులో డార్లింగ్ తొలిసారి ఓ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారట. ఇప్పటికే ప్రభాస్ క్యారెక్టర్కు సంబంధించిన పోస్టర్ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. యానిమల్ను మించిన కంటెంట్తో స్పిరిట్ తెరకెక్కుతుందని.. తొలిరోజే రూ.150 కోట్ల వసూళ్లు ఖాయమని సందీప్ రెడ్డి ధీమాగా చెబుతున్నారు. ఈ మూవీ పూర్తయ్యాక రణ్బీర్ కపూర్తోనే 'యానిమల్ 2' తెరకెక్కించనున్నాడు. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే రాజమౌళిని సందీప్ దాటేస్తాడంటూ విశ్లేషకులు అంటున్నారు.

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సత్తా ఎప్పుడో నిరూపించుకున్నాడు. మొదటి సినిమా నుంచి చూస్తే అతని టాలెంట్ ఏంటో అర్ధమవుతుంది. కల్కి, జాంబీ రెడ్డి సినిమాలతో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. చాలా తక్కువ బడ్జెట్తో, చిన్నా చితకా ఆర్టిస్టులతోనే అద్భుతమైన సినిమాలు తీస్తున్నాడు. తేజ సజ్జతో తెరకెక్కించిన 'హను-మాన్' మూవీ సంచలన విజయాన్ని అందుకుంది. కంటెంట్తో పాటు విజువల్ ఎఫెక్ట్స్పై మనోడికి మంచి పట్టుంది. హనుమాన్లోని చివరి 20 నిమిషాలు థియేటర్లో ప్రేక్షకుడిని మునివేళ్లపై నిల్చోబెట్టాడు. రాజమౌళి తర్వాత ఆ రేంజ్ విజన్ వున్న దర్శకుడిగా అతను మార్కులు కొట్టేశాడు. ప్రశాంత్ వర్మకి కనుక భారీ బడ్జెట్, భారీ స్టార్ క్యాస్టింగ్ దొరికితే టాలీవుడ్ని మరో రేంజ్కు తీసుకెళ్లే సినిమా తీస్తాడు కదా అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. హనుమాన్కు సీక్వెల్గా తెరకెక్కుతోన్న జైహనుమాన్ మూవీతో ప్రశాంత్ వర్మ ఇంకెన్ని అద్భుతాలు చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











