Year Ender 2023: లక్కీ హీరోయిన్లు ఇద్దరే.. ఆమెకు ఒక రోజు గ్యాప్లో రెండు హిట్లు.. ఈమెకేమో 200 కోట్లు
టాలీవుడ్లో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా సందడి చేస్తూనే ఉంటారు. ఇలా 2023లో కూడా ఎంతో మంది కొత్త భామలతో పాటు సీనియర్ బ్యూటీలు తమదైన చిత్రాలతో వచ్చారు. కానీ, వారిలో అతి తక్కువ మంది మాత్రమే విజయాలను సొంతం చేసుకుని సత్తా చాటుకున్నారు. అందులోనూ ఇద్దరు హీరోయిన్లు మాత్రం రెండు హిట్లను ఖాతాలో వేసుకుని రికార్డు సాధించారు. ఇంతకీ ఈ భామలు ఎవరు? అసలు ఈ ఏడాదిలో విజయాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్లు ఎవరు? ఆ పూర్తి వివరాలేంటో మీరే చూసేయండి!
లక్కీ హీరోయిన్ ఆమె:2023లో లక్కీ హీరోయిన్గా చెప్పుకోవాల్సిన వారిలో శృతి హాసన్ పేరు ముందుగా పేర్కొనాలి. ఎందుకంటే ఆమె ఈ ఏడాది ఆరంభంలోనే 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' వంటి చిత్రాలతో వచ్చింది. ఒకే ఒక్క రోజు గ్యాప్లో వచ్చిన ఈ రెండు మూవీలు భారీ హిట్లుగా నిలిచాయి. అంతేకాదు, ఈ రెండూ దాదాపు రూ. 350 కోట్లు వరకూ గ్రాస్ను వసూలు చేసి సత్తా చాటాయి.

ఆమెకు రెండు హిట్లు:ఈ ఏడాది సక్సెస్ఫుల్ హీరోయిన్లలో సంయుక్త మీనన్ పేరు కూడా చెప్పుకోవాలి. దీనికి కారణం ఈ బ్యూటీ కూడా రెండు విజయాలను ఖాతాలో వేసుకుంది. మొదటిగా 'సార్' అనే సినిమాతో వచ్చిన ఈ సుందరాంగి రూ. 120 కోట్లు వరకూ గ్రాస్ను వసూలు చేసింది. ఆ తర్వాత 'విరూపాక్ష' చిత్రంతోనూ వచ్చిన సంయుక్త.. మరోసారి వంద కోట్ల క్లబ్లో చేరి దుమ్ము దులిపేసింది.

బేబితో వైష్ణవి హవా:2023వ సంవత్సరంలో భారీ హిట్లను అందుకున్న హీరోయిన్లలో వైష్ణవి చైతన్య పేరును కూడా చెప్పుకోవాలి. ఈ అమ్మడు 'బేబి' అనే సినిమాతో వచ్చి ప్రేక్షకులను తనదైన అందం, అభినయంతో మాయ చేసేసింది. అలాగే, ఈ చిత్రం కలెక్షన్ల పరంగానూ సత్తా చాటుకుంది. ఫలితంగా మొదటి చిత్రంతోనే ఈమె ఖాతాలో భారీ విజయం వచ్చి చేరిపోయింది.
మరో 100 కోట్ల లేడీ:ఈ సంవత్సరం భారీ విజయాలను సొంతం చేసుకున్న మరో హీరోయిన్ కీర్తి సురేష్. 2023లో పలు భాషల్లో కొన్ని సినిమాలు చేసిన ఈ సుందరాంగి.. నానితో కలిసి చేసిన 'దసరా'తో వంద కోట్ల క్లబ్లో చేరింది. మరీ ముఖ్యంగా ఇందులో తెలంగాణ యువతిగా కీర్తి సురేష్ చేసిన నటన, డ్యాన్స్ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అంతలా ఆ పాత్రలో ఆమె జీవించేసిందని చెప్పాలి.

మృణాల్ మరోసారి:2023వ ఏడాదిలో బిగ్ సక్సెస్లను చూసిన హీరోయిన్లలో 'సీతా రామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా ఉంది. ఇటీవలే ఈమె నానితో కలిసి 'హాయ్ నాన్న' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఏకంగా రూ. 60 కోట్లకు పైగా గ్రాస్ను వసూలు చేయడంతో పాటు ఇంకా రన్ను కొనసాగిస్తూనే ఉంది.
ఆ హీరోయిన్లు కూడా:ఈ ఏడాది విజయాలను అందుకున్న హీరోయిన్లు మరికొందరు కూడా ఉన్నారు. వారిలో అనుష్క శెట్టి కూడా ఉంది. ఆమె 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కింది. అలాగే, 'సామజవరగమణ' మూవీతో రెబా మౌనికా జాన్, 'దాస్ కా ధమ్కీ'తో నివేదా పేతురాజ్, 'కోటబొమ్మాళి పీఎస్'తో శివాజి రాజశేఖర్ సహా పలువురు విజయాలను అందుకున్నారు.


Click it and Unblock the Notifications











