Michaung Cyclone చెన్నై వరదల్లో చిక్కుకొన్న అమీర్ ఖాన్.. ఎవరు? ఎలా రక్షించారంటే?
తమిళనాడు రాష్ట్రాన్ని మిగ్జాం తుఫాన్ అతలాకుతలం చేస్తున్నది. తుఫాన్ ప్రభావానికి చెన్నైలోని ప్రధాన రహదారులన్నీ జలాశయాలుగా మారాయి. దాంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. చెన్నైలోని పలు ప్రాంతాల్లో చిక్కుకొన్న ప్రజలను అధికారులు, సిబ్బంది, స్వచ్చంద సంస్థలకు చెందిన కార్యకర్తలు సహయ సహకారాలు అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా వరదల్లో చిక్కుకుపోయారు. అయితే ఆయనను తమిళనాడు ప్రభుత్వ అధికారులు, తమిళ నటుడు విష్ణు విశాల్ వరద ప్రవాహం నుంచి విముక్తి కలిగించాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

అమీర్ ఖాన్ విషయానికి వస్తే.. కొద్ది రోజులుగా ముంబై, చెన్నై నగరాల్లో గడుపుతున్నారు. ఆయన తల్లి జీనత్ హుస్సేన్ గుండెపోటుకు గురయ్యారు. దాంతో చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్లో వైద్య చికిత్స జరుగుతున్నది. అందుకోసం ఎక్కువగా చెన్నైలోని గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఉంటున్న ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి అని తెలిసింది.
అయితే అమీర్ ఖాన్తో పలువురు వరదల్లో చిక్కుకొన్నారనే విషయం తెలిసిన వెంటనే ఫైర్ అండ్ రెస్కూ అధికారులు సహాయచర్యల్లో భాగమయ్యారు. వారితోపాటు హీరో విష్ణు విశాల్ కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దాదాపు మూడు పడవల్లో వెళ్లి అమీర్ ఖాన్తోపాటు పలువురిని సురక్షిత ప్రాంతానికి చేర్చారు.

అనంతరం విష్ణు విశాల్ ట్వీట్ చేస్తూ.. అగ్నిమాపక దళం అధికారులకు థ్యాంక్స్. వరదల్లో చిక్కుకుపోయిన చాలా మందిని అధికారులు, ప్రభుత్వ సిబ్బంది కాపాడారు. ఇప్పటికే మూడు పడవల్లో బాధితులను తరలిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం స్పందించిన తీరు అద్బుతంగా ఉంది. అధికారులు, ప్రజలు ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు అని విశాల్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
మిగ్జౌ తుఫాన్ కారణంగా ముంచెత్తిన ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలను విష్ణు విశాల్ పోస్టు చేశారు. సాధారణ పౌరుడిగా మారిన ఆయన పలు ప్రాంతాల్లో బోట్స్ సహాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. కరపక్కమ్ ప్రాంతంలో ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వైఫై, మొబైల్ సేవలు నిలిచిపోయాయి అని తెలిపారు.


Click it and Unblock the Notifications











