నమ్మించి 100 కోట్లు ముంచాడు.. జయం రవి- కేనిషా అఫైర్లో కొత్త ట్విస్ట్
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి అతని సతీమణి ఆర్తి రవి, అతని ప్రియురాలు కేనీషా ఫ్రాన్సిస్ మధ్య నడుస్తోన్న ట్రయాంగిల్ స్టోరీ రోజుకొక మలుపు తిరుగుతోంది. తొలుత ఆర్తి రవి ఈ వివాదంపై స్పందించగా.. ఆ తర్వాత కేనీషా, ఆ వెంటనే జయం రవిలు స్పందించారు. ఎవరికి వారు ఈ వివాదంలో తప్పు తమది కాదంటూ ఎదుటివాళ్లపై తోసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంలోకి జయం రవి అత్తగారు, ఆర్తి రవి తల్లి సుజాత ఎంట్రీ ఇచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
పెళ్లి ఈవెంట్కు కేనీషాతో జయం రవి
తమిళ నిర్మాత గణేష్ కుమార్తె వివాహం సందర్భంగా కేనీషాతో కలిసి జయం రవి జంటగా కనిపించడంతో ఆ వివాదం మొదలైంది. అప్పట్లో తమ మధ్య ఏం లేదని బుకాయించిన కేనీషా ఫ్రాన్సిస్.. హీరోతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటంతో కోలీవుడ్ షాకైంది. ఇది జరిగిన కొద్దిగంటలకే ఆర్తి రవి సీన్లోకి వచ్చారు. 18 ఏళ్లు తనతో కాపురం చేసిన వ్యక్తి ఇలా చేస్తున్నాడని భర్తగా, తండ్రిగా జయం రవి తన బాధ్యతలు పట్టించుకోవడం లేదని ఆర్తి రవి ఆరోపించారు. తమ విడాకుల వ్యవహారం కోర్టులో ఉండగానే రవి ఇలాంటి పనులు చేస్తున్నాడని మండిపడ్డారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు జయం రవికి అండగా నిలిచారు.

సినీ ప్రముఖులకు వార్నింగ్ ఇచ్చిన కేనీషా
జయం రవి కాపురంలో చిచ్చుపెట్టినట్లుగా తనపై జరుగుతున్న ట్రోలింగ్పై కేనీషా ఫ్రాన్సిస్ స్పందించారు. ఏదైనా ఉంటే నేరుగా తనతోనే మాట్లాడాలని, కొందరు తమ పనులు మానేసి పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారంటూ సీనియర్ నటులు ఖుష్బూ, రాధిక శరత్ కుమార్ తదితరులకు చురకలు వేశారు కేనీషా. వివాదం మలుపులు తిరుగుతున్న వేళ జయం రవి మౌనం వీడారు. ఆర్తి రవితో విడాకులు, కేనీషాతో బంధంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాహం తర్వాత తన భార్యతో ఉన్నన్ని రోజులు ఏదో పంజరంలో ఉన్నట్లుగా తన పరిస్ధితి ఉందని వ్యాఖ్యానించారు.
ఓర్పుతో భరించానన్న జయం రవి
మానసికంగా, శారీరకంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని.. చివరికి తన తల్లిదండ్రులను కూడా కలవడానికి వీల్లేకుండా పోయిందని జయం రవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్తితో చివరి వరకు కలిసి ఉండటానికి ప్రయత్నించానని, ఇక ఆ బాధ భరించలేక కఠిన నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. కేనీషాతో పరిచయం తర్వాత కోలుకుంటున్నానని జయం రవి దాదాపు నాలుగు పేజీల లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వివాదం మరింత ముదురుతున్న నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
జయం రవి వల్లే 100 కోట్ల అప్పులు
ఈ విడాకుల పంచాయతీలోకి జయం రవి అత్తగారు, ఆర్తి రవి తల్లి సుజాత విజయ్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు. జయం రవిని తాను అల్లుడిలా కాకుండా కొడుకులా చూసుకున్నానని, కానీ ఆయన అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. జయం రవి వల్లే తాను సినిమా నిర్మాణం వైపు అడుగులు వేశానని.. ఇతనితో సినిమాలు చేసేందుకు దాదాపు రూ.100 కోట్లు అప్పులు చేసి అడంగ మరు, భూమి, సైరన్ చిత్రాలు నిర్మించానని సుజాత పేర్కొన్నారు.
సానుభూతి కోసమే రవి డ్రామాలు
ఈ సినిమాల కోసం 100 కోట్లలో 25 శాతంను జయం రవికి పారితోషికం కింద చెల్లించానని, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ తన దగ్గర ఉన్నాయని సుజాత తెలిపారు. చేసిన అప్పులు కట్టడానికి తను ఎంతో కష్టపడుతుంటే, సాయం చేస్తానని మాటిచ్చిన జయం రవి సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. జయం రవి ఎప్పటికీ హీరోగానే ఉండాలని కోరుకుంటున్నానని సుజాత అన్నారు. ప్రస్తుతం సుజాత వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతుండగా నెక్ట్స్ ఎవరు స్పందిస్తారు? ఎలాంటి ఆధారాలు బయటపెడతారోనని కోలీవుడ్ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.


Click it and Unblock the Notifications











