కుమారుడి సినిమా గొడవ.. 14 ఏళ్ళైనా వదిలిపెట్టని హీరో తండ్రి.. ఏం జరిగిందంటే!
తమిళ చిత్ర పరిశ్రమలో స్టైలిష్ హీరో శింబు విషయంలో తరచుగా వివాదాలు చెలరేగుతుంటాయి. శింబు తండ్రి టి. రాజేందర్ పేరు కూడా వివాదాల్లో వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా 14 ఏళ్లనాటి కేసు విషయంలో రాజేందర్ పోలీసులని ఆశ్రయించాడు. హీరో శింబు నటించిన మన్మధ చిత్రం 2004 లో విడుదలయింది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఆ చిత్రానికి సంబంధించిన హక్కుల విషయంలో చెలరేగిన వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

మన్మథ చిత్రం
మన్మథ చిత్రం రొమాంటిక్ అంశాలతో అప్పట్లో యువతని బాగా ఆకట్టుకుంది. శింబునే ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం. శింబుకు జోడిగా ఈ చిత్రంలో జ్యోతిక, సింధు తులాని నటించారు. యువన్ శంకర్ రాజా అందించిన సంగీత విపరీతంగా ఆకట్టుకుంది. స్టైలిష్ లుక్ లో శింబు నటనకు అంతా ఫిదా అయ్యారు. తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం గా నిలిచింది.

హక్కుల విషయంలో గొడవ
ఈ చిత్ర హక్కుల విషయంలో శింబు తండ్రి రాజేందర్ కు, ఎస్ఎమ్ మీడియా సంస్థకు మధ్య వివాదం 14 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. ఇటీవల కూడా ఎస్ఎమ్ మీడియా సంస్థ మన్మథ చిత్రం తమదే అని ప్రకటించుకోవడంతో రాజేందర్ పోలీసులని ఆశ్రయించారు. ఈ గొడవకు కారణం నిర్మాత తేనప్పన్ అని రాజేందర్ పోలిసుల ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎన్ని చర్చలు జరిగినా
ఈ వివాదం గురించి తమిళ చిత్ర పరిశ్రమ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎన్ని చర్చలు జరిగినా వివాదం మాత్రం సద్దుమణగడం లేదు. తాజాగా రాజేందర్ పోలీసులకు ఆశ్రయించడంతో వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అని ఆసక్తి నెలకొంది. పోలిసుల వద్ద సమస్య పరిష్కారం కాకుంటే రాజేందర్ కోర్టుని ఆశ్రయించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

అత్తారింటికి దారేది రీమేక్
శింబు నటిస్తున్న తాజా చిత్రం వంత రాజవతం వరువేన్. అత్తారింటికి దారేది చిత్రానికి ఇది తమిళ రీమేక్. సుందర్ సి ఈ చిత్రానికి దర్శకుడు. మేఘ ఆకాష్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా మరోమారు శింబు మణిరత్నం దర్శత్వంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











