కమల్ హాసన్ మాజీ ప్రియురాలికి బెదిరింపులు.. ఆ గొడవల్లో ప్రాణాల మీదకి?
సినీనటులు, రాజకీయవేత్తలకు ఇటీవలి కాలంలో బెదిరింపులు ఎదురవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ సీనియర్ హీరోయిన్, కాంగ్రెస్ నేత విజయశాంతికి కూడా బెదిరింపులు రావడంతో ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కోలీవుడ్కు చెందిన సీనియర్ నటి గౌతమి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. ఈ వివరాల్లోకి వెళితే..
దశాబ్ధం పాటు గౌతమి హవా
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లికి చెందిన గౌతమి విశాఖలోని గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఈ క్రమంలో సినీరంగంలోనే ఉన్న తన బంధువు ద్వారా తెలుగు చిత్రం దయామయుడు (1987) ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అనంతరం గాంధీ నగర్ రెండవ వీధి, శ్రీనివాస కళ్యాణం చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో తమిళ చిత్రం గురుశిష్యన్ ద్వారా కోలీవుడ్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత తమిళ, తెలుగు, కన్నడ, మలయళ చిత్రాల్లో దశాబ్ధం పాటు తన హవా సాగించారు గౌతమి. దక్షిణాదిలోని అందరు అగ్రనటులతో ఆమె నటించారు.

విడాకులు, కమల్ హాసన్తో సహజీవనం
తొలుత సందీప్ భాటియా అనే వ్యాపారవేత్తను 1998లో పెళ్లాడారు గౌతమి ఈ దంపతులకు సుబ్బలక్ష్మీ సంతానం. పెళ్లయి ఏడాది కాకుండానే సందీప్- గౌతమిలు విడిపోయారు. అనంతరం కొన్నాళ్లు ఒంటరిగానే ఉన్న ఆమె కోలీవుడ్ అగ్ర కథానాయకుడు కమల్ హాసన్తో రిలేషన్లో ఉన్నారు. 2005 నుంచి 2016 వరకు ఆయనతోనే సహజీవనం చేశారు గౌతమి. ఈ దశలో 2016లో కమల్ హాసన్తో 13 ఏళ్ల బంధాన్ని ఆమె తెంచుకున్నారు. అయితే 35 ఏళ్ల వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడ్డ గౌతమి మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఆ మహమ్మారిని జయించి ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు.
30 ఏళ్ల క్రితమే రాజకీయాల్లోకి
రాజకీయాలపై తొలి నుంచి ఆసక్తితో ఉన్న గౌతమి 1997లోనే భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్గా సేవలందించిన ఆమె బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అద్వానీకి అత్యంత సన్నిహితురాలిగా సేవలందించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలలో బీజేపీ తరపున ప్రచారం చేశారు. అయితే అనుకోకుండా రాజకీయాలకు బ్రేకిచ్చిన గౌతమి.. 2017లో తిరిగి యాక్టీవ్ అయ్యారు. 2021లో తమిళనాడులోని రాజపాల్యం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా గౌతమిని నియమించింది బీజేపీ. అయితే 2023లో భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన గౌతమి.. 2024లో అన్నాడీఎంకేలో చేరారు.
చంపేస్తామని బెదిరింపులు
లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ రోగులకు సేవ చేస్తున్నారు గౌతమి. ఇందుకోసం తన ఆస్తిలోని కొంత భాగాన్ని కేటాయించారు. తాజాగా గౌతమి తనను కొందరు చంపేస్తామని బెదిరిస్తున్నారని, తన ప్రాణాలకు హాని ఉందని ఆమె చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని, ఆస్తి తగాదాల కారణంగానే ఈ బెదిరింపులు వస్తున్నాయని గౌతమి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గౌతమి ఫిర్యాదు, బెదిరింపుల వ్యవహారం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











