టెలివిజన్ నటి కస్తూరి అరెస్ట్?.. తెలుగు వాళ్లపై నోటి దురుసుతో చిక్కుల్లో..!
వివాదాస్పద వ్యాఖ్యలు, పోస్ట్లతో నిత్యం వార్తల్లో నిలిచే సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్ చిక్కుల్లో చిక్కుకున్నారు. తెలుగు వారిపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఏపీ, తెలంగాణ, తమిళనాడులలో దుమారం రేపింది. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ తెలుగు, తమిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేనిపక్షంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని ఆయా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
నటిగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నాయకురాలిగా యాక్టీవ్గా ఉంటారు కస్తూరి శంకర్. సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు వివాదాస్పద పోస్ట్లు పెడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. తన సినిమాలు , వ్యక్తిగత వివరాలతో పాటు సామాజిక అంశాలపైనా స్పందిస్తూ ఉంటారు. ఇటీవల ఓ బహిరంగ సభలో కస్తూరి శంకర్ మైక్ అందుకుని పూనకం వచ్చినట్లుగా మాట్లాడారు. 300 ఏళ్ల క్రితం తమిళనాడులోని రాజుల వద్ద అంత: పుర మహిళలకి సేవ చేయడానికి తెలుగువారు ఈ ప్రాంతానికి వలస వచ్చి స్థిరపడ్డారని చెప్పారు. వారంతా శతాబ్ధాలుగా స్థిరపడిన బ్రాహ్మణులేనని, ఇప్పుడు వారిని తమిళులు కాదని ఎలా చెబుతారని కస్తూరి ప్రశ్నించారు. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంత్రివర్గంలోని తెలుగు మూలాలున్న మంత్రులను టార్గెట్ చేసేలా ఆమె వ్యాఖ్యానించారు.

అయితే ఇవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కస్తూరిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆమె రెండ్రోజుల క్రితం ఎక్స్ ద్వారా స్పందించారు. తెలుగు నా మెట్టినిల్లు.. తెలుగు వారంతా నా కుటుంబమని ఇది తెలుసుకోకుండా కొందరు నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని మండిపడ్డారు. తెలుగు ప్రజలు తనపై ప్రేమను, అభిమానాన్ని చూపుతున్నారు. కానీ నేను చేసిన వ్యాఖ్యలను డీఎంకే నేతలు వక్రీకరించి.. నాపై వ్యతిరేకత తీసుకొచ్చి నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని కస్తూరి ఆరోపించారు. ఈ యాంటీ హిందువులు.. ప్రస్తుతం సనాతన ధర్మాన్ని పాటిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డిలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. డీఎంకే చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని తెలుగు మీడియాకు కస్తూరి శంకర్ విజ్ఞప్తి చేశారు.
అయినప్పటికీ కస్తూరిపై ట్రోలింగ్ ఆగలేదు .. దీంతో మరోసారి ఆమె వివరణ ఇచ్చారు. తాను భారతదేశ భిన్నత్వంలో ఏకత్వం నినాదంపై గౌరవం కలిగినదాన్నని, తెలుగు భాషతో తనది ప్రత్యేక బంధమని చెప్పారు. తెలుగు ప్రజలు తనకు కీర్తి ప్రతిష్టలను, కుటుంబాన్ని ఇచ్చారని .. తాను కొందరి గురించే చెప్పానని, మొత్తం తెలుగు ప్రజల గురించి కాదని కస్తూరి వివరణ ఇచ్చారు. ఎవరైనా తన వ్యాఖ్యలతో బాధపడి ఉంటే చింతిస్తున్నానని తెలిపారు.
అయితే ఆమె వివరణ ఇచ్చినా, క్షమాపణలు చెప్పినా తెలుగు, తమిళ నేతలు తగ్గడం లేదు. తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాల్లో పోలీసులకు తెలుగు సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. తమిళర మున్నేట్ర పడై అధ్యక్షురాలు వీరలక్ష్మీ స్వయంగా చెన్నై పోలీస్ కమీషనర్కు ఫిర్యాదు చేశారు. తెలుగు వారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కస్తూరి చర్యలు తీసుకోవాలని అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటీఎఫ్) డిమాండ్ చేసింది. వారి ఫిర్యాదు మేరకు చెన్నై ఎగ్మూర్ పోలీస్ స్టేషన్లో కస్తూరి శంకర్పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ పరిణామాలతో కస్తూరి అరెస్ట్ అవుతుందా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











