తెలుగు వారిపై వ్యాఖ్యలు .. నటి కస్తూరికి రిమాండ్, చెన్నై సెంట్రల్ జైలుకి తరలింపు
తెలుగు వారు తమిళులకు సేవకులు అనే అర్ధం వచ్చేలా మాట్లాడి సీనియర్ హీరోయిన్ కస్తూరి లేనిపోని వివాదంలో చిక్కుకున్నారు. తెలుగు వారిపై ఆమె చేసిన వ్యాఖ్యలతో తెలుగు సంఘాలు భగ్గుమన్నాయి. చివరికి ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి అరెస్ట్కు దారి తీసిన సంగతి తెలిసిందే. సమన్లు తీసుకోకుండా తప్పించుకుని తిరుగుతున్న కస్తూరిని చెన్నై పోలీసులు శనివారం రాత్రి హైదరాబాద్లో అదుపులో తీసుకుని తిరిగి తమిళనాడుకు తరలించిన సంగతి తెలిసిందే.
ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభలో కస్తూరి శంకర్ మాట్లాడుతూ.. తెలుగు జాతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 300 ఏళ్ల క్రితం తమిళనాడులోని రాజుల వద్ద అంత: పుర మహిళలకి సేవ చేయడానికి తెలుగువారు ఈ ప్రాంతానికి వలస వచ్చి స్థిరపడ్డారని కస్తూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారంతా శతాబ్ధాలుగా స్థిరపడిన బ్రాహ్మణులేనని, ఇప్పుడు వారిని తమిళులు కాదని ఎలా చెబుతారని కస్తూరి ప్రశ్నించారు. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలుగు , తమిళ సంఘాలు మండిపడ్డాయి.

తమిళనాడులోని అధికార డీఎంకేలో తెలుగు మూలాలున్న మంత్రులు, నేతలను టార్గెట్ చేసే క్రమంలో కస్తూరి ఈ వ్యాఖ్యలు చేశారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో తెలుగు నా మెట్టినిల్లు.. తెలుగు వారంతా నా కుటుంబమని , తాను చేసిన వ్యాఖ్యలను డీఎంకే నేతలు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అయినప్పటికీ కస్తూరిపై ట్రోలింగ్ ఆగలేదు .. తాను కొందరి గురించే చెప్పానని, మొత్తం తెలుగు ప్రజల గురించి కాదని కస్తూరి మరోసారి వివరణ ఇచ్చారు. ఎవరైనా తన వ్యాఖ్యలతో బాధపడి ఉంటే చింతిస్తున్నానని తెలిపారు.
క్షమాపణలు చెప్పినప్పటికీ తెలుగు, తమిళ నేతలు దిగిరాకపోగా.. చెన్నై ఎగ్మూర్ పోలీస్ స్టేషన్లో కస్తూరి శంకర్పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు హాజరవ్వాల్సిందిగా పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేసేందుకు వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉందని, ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు గాను మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్లో కస్తూరి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తెలుగు, తమిళ ప్రజలు రాష్ట్రంలో వేర్వేరు కాదని వ్యాఖ్యానించిన ధర్మాసనం బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది.

కోర్టు నిర్ణయంతో కస్తూరి కోసం గాలింపు చర్యలు ముమ్మరించిన చెన్నై పోలీసులు.. ఆమె హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో ఉన్నట్లు గుర్తించి శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి నేరుగా చెన్నై తరలించిన పోలీసులు .. ఆదివారం వైద్య పరీక్షల అనంతరం ఎగ్మోర్ మెట్రోపాలిటన్ కోర్ట్ ఎదుట హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో కస్తూరిని పోలీసులు చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టు బయట మీడియా ప్రతినిధులను చూసిన కస్తూరి.. పిడికిలి బిగించి న్యాయాన్ని గెలిపించమంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం కస్తూరి అరెస్ట్, రిమాండ్ వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











