Valimai: టాలీవుడ్ బడా సినిమాలకు షాకిచ్చిన అజిత్.. RRR, రాధేశ్యామ్కు పోటీ ఇచ్చేలా ప్లాన్
పేరుకు తమిళ హీరోనే అయినా.. దక్షిణాది మొత్తం మెచ్చే స్టార్గా వెలుగొందుతున్నాడు బడా హీరో అజిత్ కుమార్. విలక్షణమైన నటన.. విభిన్నమైన చిత్రాలతో కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకున్న అతడు.. తక్కువ సమయంలోనే గొప్ప నటుడిగా గుర్తింపు పొందాడు. అదే సమయంలో స్టార్డమ్ను కూడా సొంతం చేసుకున్నాడు. మరీ ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ మన్ననలు పొందుతూ ఎంతో మంది అభిమానాన్ని అందుకున్నాడు. ఇలా దాదాపు మూడు దశాబ్దాలుగా దక్షిణాదిలో హవాను చూపిస్తూ దూసుకుపోతున్నాడు. దీంతో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.
చాలా కాలం పాటు వరుస ఫ్లాపులను చవి చూసిన కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ కుమార్.. హిందీ చిత్రం పింక్కు రీమేక్గా వచ్చిన 'నెర్కొండ పార్వాయి'తో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ విజయం ఇచ్చిన జోష్తోనే ఆ వెంటనే 'వాలిమై' అనే సినిమాను ప్రారంభించాడు. దీన్ని కూడా హెచ్ వినోథ్ తెరకెక్కిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అవుతోన్నా.. అనివార్య కారణాల వల్ల పలుమార్లు ఆటంకం ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన టాక్ పార్ట్ కొద్ది రోజుల క్రితమే పూర్తైంది. అలాగే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం శరవేగంగా సాగుతున్నాయి.

అజిత్ కుమార్కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అందుకే అతడు నటించిన అన్ని సినిమాలూ మన దగ్గర కూడా విడుదల అవుతుంటాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు చేస్తున్న 'వాలిమై' సినిమాను కూడా తెలుగులోకి డబ్ చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే, ఇటీవలే దీన్ని రీమేక్ చేస్తున్నారని, అందుకే తెలుగులో విడుదల చేయరని జోరుగా ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమాను మన దగ్గర కూడా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, ఈ మూవీ తెలుగు వెర్షన్కు 'బలం' అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేసి పోస్టర్ను వదిలారు.
క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న 'వాలిమై' సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయబోతున్నారు. తమిళంలో అప్పుడు విజయ్ నటిస్తోన్న 'బీస్ట్' కూడా విడుదల అవుతుందని వార్తలు వచ్చినా.. అది వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కానీ, ఈ చిత్రం మాత్రం సంక్రాంతికే రానుందట. అదే జరిగితే ప్రతిష్టాత్మక చిత్రం RRRకు తర్వాత 'రాధే శ్యామ్'కు ఒక్క రోజు ముందు ఇది విడుదల అవుతుంది. ఇది ఆ చిత్రాలపై ప్రభావాన్ని చూపకపోయినా.. కొంతలో కొంతైనా పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తోంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'వాలిమై' మూవీలో అజిత్ కుమార్ డుయల్ రోల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఒకటి బైక్ రేసర్ పాత్ర అని కూడా అంటున్నారు. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందింది. ఇందులో తెలుగు యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ విలన్గా నటిస్తున్నాడు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ దీన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో హుమా ఖురేషి కథానాయికగా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియోల వల్ల ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.


Click it and Unblock the Notifications











