‘బాహుబలి 2’ చిత్రానికి సంబంధించిన డబ్బులు ఇంకా రాలేదు.. లీగల్ నోటీసులు!
'బాహుబలి 2' చిత్రం విడుదలైన దాదాపు 2 సంవత్సరాలు కావస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పేమెంట్స్ వ్యవహారాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతలకు రావాల్సిన పేమెంట్స్ ఇప్పటికీ పెండింగులోనే ఉన్నాయట.
బాహుబలి చిత్రాన్ని నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ తరుపున శోభు యార్లగడ్డ... తమిళనాడుకు చెందిన 'కె ప్రొడక్షన్స్' బాస్ రాజరాజన్కు లీగల్ నోటీసులు పంపారు. రాజరాజన్ ఇచ్చిన రూ. 17.60 కోట్ల చెక్ బౌన్స్ కావడంతో ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
రూ. 52 కోట్లకు రైట్స్ దక్కించుకున్న ‘కె ప్రొడక్షన్స్'
తమిళనాడులోని ప్రముఖ సినీ డిస్ట్రిబ్యూషన్ సంస్థల్లో రాజరాజన్కు చెందిన ‘కె ప్రొడక్షన్స్' ఒకటి. తమిళనాడు బాహుబలి 2 థియేట్రికల్ రైట్స్ ఈ సంస్థ రూ. 52 కోట్లకు దక్కించుకుంది. కోలీవుడ్ సినీ చరిత్రలో బయటి సినిమాను ఇంత భారీ రేటుకు కొనుగోలు చేయడం ఇదే తొలిసారి.

ఇంకా రూ. 17.60 కోట్లు చెల్లించాలి
రాజరాజన్ నుంచి ఇంకా రూ. 17.60 కోట్ల పేమెంట్ రావాల్సి ఉండగా ఈ మొత్తానికి గాను అతడు ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. దీంతో వారు కె ప్రొడక్షన్స్ సంస్థకు లీగల్ నోటీసులు జారీ చేశారు. వారంలోగా డబ్బు చెల్లించని పక్షంలో సంస్థకు చెందిన బ్యాంక్ అకౌంట్స్ ఎటాచ్ చేసే అవకాశం ఉంది.

బాహుబలి 2
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా, నాజర్, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘బాహుబలి 2' చిత్రం ఏప్రిల్ 28. 2017న విడుదలై బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 1800 కోట్ల పైచిలుకు గ్రాస్ వసూలు చేసింది.

తమిళనాడులో వసూళ్లు
బాహుబలి 2 చిత్రం తమిళనాడులో రూ. 152.6 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఇందులో దాదాపు రూ. 78 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది. అంటే కె ప్రొడక్షన్స్ వారు పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవడంతో పాటు దాదాపు రూ. 26 కోట్ల లాభాలు గడించారు.


Click it and Unblock the Notifications











