అతడు దూరం కావడం వల్లే శంకర్కు ఫ్లాపులా? ఇండియన్ డైరెక్టర్ బుర్రకి ఏమైంది.. ఎందుకీ తడబాటు?
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. సామాజిక బాధ్యతకు కమర్షియల్ హంగులు అద్ది బ్లాక్బస్టర్లు కొట్టడంలో ఆయన సిద్ధహస్తుడు. అతను మరెవరో కాదు శంకర్ షణ్ముగం.. అలియాస్ డైరెక్టర్ శంకర్. జెంటిల్మెన్ నుంచి నేటి భారతీయుడు -2 వరకు ఒకటే ఫార్ములాతో సినిమాలు తీసి బ్లాక్బస్టర్లు కొట్టారు శంకర్. తీసింది తక్కువ సినిమాలు అయినా తరతరాలు చెప్పుకునే పేరును సంపాదించారు. హీరోలు రాజ్యమేలే చిత్ర పరిశ్రమలో దర్శకుడికి స్టార్ స్టేటస్ను తెచ్చిన అరుదైన డైరెక్టర్. శంకర్ సినిమాలంటే ఓ బ్రాండ్.. ఇప్పుడు రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్, నాగ్ అశ్విన్లు వచ్చారు కానీ అసలు దక్షిణాది సినిమా ఖ్యాతిని ఎప్పుడో దశదిశలా వ్యాపింపజేశారు శంకర్.
1996లో అగ్ర కథానాయకుడు కమల్ హాసన్తో శంకర్ తీసిన భారతీయుడు ఓ ట్రెండ్ సెట్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్ తీయాలని అనుకున్నా పలు కారణాలతో కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో దాదాపు 28 ఏళ్ల తర్వాత భారతీయుడు -2ని తెరకెక్కించారు శంకర్. ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మార్నింగ్ షో నుంచే భారతీయుడు-2కి డివైడ్ టాక్ రావటంతో పాటు అసలు ఇది శంకర్ సినిమాయేనా అన్న అనుమానం ప్రేక్షకుల్లో కలుగుతోంది.

తొలి 20 నిమిషాలు తప్పించి.. సినిమాలో చెప్పుకోవడానికి ఏం లేదని, ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టిందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. సోషల్ మీడియాలో శంకర్ పట్ల ఆవేదన, ఆక్రోషాన్ని వెళ్లగక్కుతున్నారు. అయితే కేవలం ఇండియన్ 2 మాత్రమే కాదు.. గత కొంతకాలంగా శంకర్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఉండటం లేదనే మాట వినిపిస్తున్నది.
భారతీయ చిత్ర పరిశ్రమను ఒకప్పుడు షేక్ చేసిన ఈ క్రియేటివ్ జీనియస్కు అసలేమైంది, ఎందుకిలా తడబడుతున్నారు అనే చర్చ ఫిలింనగర్ సర్కిల్స్లో జరుగుతోంది. అయితే శంకర్ సినిమాలు ఫెయిల్ అవ్వడానికి కొందరు ఓ వ్యక్తి పేరును చెబుతున్నారు. ఆయన లేకపోవడం వల్లే శంకర్ తెరకెక్కించే సినిమాలు జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయని అనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
ఆ వ్యక్తి పేరు సుజాత రంగరాజన్. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్ధి అయిన ఆయన ఇంజనీర్గా ఈవీఎం తయారీలో కీలకపాత్ర పోషించారు. అయితే సుజాతకు పుస్తకాలు రాయడం ఓ హాబీ. కెరీర్లో దాదాపు 80 నవలలు, 150 చిన్న కథలు, 10 సైన్స్ బుక్స్, 10 నాటకాలు, లెక్కలేనన్ని కవితలు, ఆర్టికల్స్ రాశారు. శంకర్తో జత కలిసిన సుజాత.. జెంటిల్మెన్ నుంచి రోబో వరకు ప్రతి చిత్రానికీ పనిచేసి వాటి విజయాల్లో కీలకపాత్ర పోషించారు. సుజాత ఇచ్చే సలహాలు, సూచనల ఆధారంగా శంకర్ మార్పులు , చేర్పులు చేసి సినిమాలు తీసేవారు. ఈ క్రమంలో 2008లో సుజాత రంగరాజన్ కన్నుమూయడంతో శంకర్కు దెబ్బ తగిలినట్లయ్యింది.

సుజాత మరణించిన నాటి నుంచి శంకర్కు సరైన హిట్ పడలేదు. త్రీ ఇడియట్స్ రీమేక్ స్నేహితుడు, ఐ, రోబో 2.0లు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఇండియన్ -2 రిజల్ట్ కూడా తేడా కొట్టినట్లే కనిపిస్తోంది. కథలో లోపాలు, ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు వంటి విషయాలను సుజాత దగ్గరుండి చూసుకునేవారు. కానీ ఆయన లేకపోవడంతో శంకర్ తడబడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన నెక్ట్స్ మూవీ గేమ్ ఛేంజర్పై ఆసక్తి నెలకొంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథను అందిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా అయినా హిట్ కొట్టి శంకర్ను నిలబెడుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











