నయనతార, నెట్ఫ్లిక్స్కు హైకోర్టు షాక్.. చంద్రముఖి నిర్మాతల పిటిషన్పై నోటీసులు
స్టార్ హీరోయిన్ నయనతార జీవితంపై డాక్యుమెంటరీపై వివాదం కొనసాగుతూనే ఉంది. తమిళ స్టార్ హీరో ధనుష్, చంద్రముఖి నిర్మాతలతో కొనసాగుతున్న కోర్టు వివాదంలో నయనతారకు, నెట్ ఫ్లిక్స్ సంస్థకు ఎదురు దెబ్బ తగిలింది. ధనుష్ తర్వాత తాజాగా చంద్రముఖి నిర్మాతల తరపున ఏపీ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు నోటీసులు జారీ చేసింది. తమ అనుమతి లేకుండా డాక్యుమెంటరీలో తమ సినిమాల్లోని కంటెంట్ను వాడుకొన్నారనే ఆరోపణలపై నడుస్తున్న కాపిరైట్ వివాదంలో మద్రాస్ హైకోర్టు నోటీసులు మంగళవారం జారీ చేసింది. ఈ వివాదం, కోర్టు తీర్పుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
నయనతార జీవితం, అలాగే కెరీర్లోని కీలక సంఘటనలు, ఘట్టాలను ఆధారంగా చేసుకొని నయనతార: బియాండ్ ది ఫెయిర్టేల్ అనే డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్ నవంబర్ 2024 సంవత్సరంలో స్ట్రీమింగ్ చేశారు. ఈ డాక్యుమెంటరీలో విఘ్నేష్ శివన్తో పెళ్లి అంశంతోపాటు వ్యక్తిగత, ప్రొఫెషనల్ అంశాలను పొందుపరిచారు. ఈ డాక్యుమెంటరీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వ్యక్తమైంది.

అయితే ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాతగా విఘ్నేష్ శివన్ దర్శకుడిగా రూపొందించిన నానుమ్ రౌడీ ధాన్ అనే సినిమాలోని కంటెంట్ను అనుమతి లేకుండా ఉపయోగించారు. దాంతో ఈ డాక్యుమెంటరీలో తన సినిమా కంటెంట్ను అనుమతి లేకుండా ఉపయోగించినందున 10 కోట్లు చెల్లించాలని కోర్టులో ధనుష్ తొలుత పిటిషన్ దాఖలు చేశారు. తాను అభ్యంతరం తెలిపినా ఆ ఫుటేజ్ను తొలగించకపోవడంపై ధనుష్ సీరియస్ అయ్యారు. ఆ తర్వాత చంద్రముఖి నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు.
అలాగే చంద్రముఖి సినిమాకు సంబంధించిన క్లిప్పింగ్స్ ఉపయోగించడంపై శివాజీ ప్రొడక్షన్స్ అభ్యంతరం తెలిపారు. తమ అనుమతి లేకుండా కంటెంట్ వాడటంపై కాపిరైట్ చట్టం కింద తమకు 5 కోట్ల రూపాయల చెల్లించాలని పిటిషన్ దాఖలు చేశారు. యూట్యూబ్ నుంచి సినిమా కంటెంట్ను తీసుకొని డాక్యుమెంటరీలో పొందుపరిచారు అనే విషయంపై కోర్టును ఆశ్రయించారు అని ఏపీ ఇంటర్నేషనల్ వెల్లడించింది.
ఈ వివాదం గురించి మద్రాస్ హైకోర్టు నోటీసుల గురించి లీగల్ వైబ్సైట్ లైవ్ లా (LiveLaw) పేర్కొన్న ప్రకారం.. నయనతార డాక్యుమెంటరీ వివాదంలో టార్క్ స్టూడియో ఎల్ఎల్పీ, నెట్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సర్విసెస్ ఇండియా ఎల్ఎల్పీ సంస్థలకు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పర్మిషన్, లైసెన్సే లేకుండా ఆడియో, వీడియో కంటెంట్ను ఉపయోగించుకొని కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘించారు. ఇందుకు గాను 5 కోట్ల రూపాయలు చెల్లించాలని స్పష్టం పేర్కొన్నది.
అయితే తాజా కోర్టు ఆదేశాలపై ఇంకా నయనతార, నెట్ఫ్లిక్స్ సంస్థలు స్పందించలేదు. ఈ తీర్పును వారు ఛాలెంజ్ చేసి పైకోర్టుకు వెళ్తారా? లేదా కోర్టు వెల్లడించిన తీర్పు ప్రకారం జరిమానాను కడుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై నయనతార వర్గం, నెట్ఫ్లిక్స్ నిర్వాహకులు స్పందించే తీరుపైనే ఈ వివాదానికి ముగింపు ఉంటుందా? ఇంకా కొనసాగుతుందా? అనేది తెలుస్తుందని సినీ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications