కమల్ హాసన్పై చెప్పుదాడి.. విసిరిన వ్యక్తి అరెస్ట్
విలక్షణ నటుడు, మక్కల్ నీది మాయిమ్ పార్టీ (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్కు చేదు అనుభవం ఎదురైంది. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కమల్ తమిళనాడులోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అయితే వాహనంపై నుంచి కమల్ హాసన్ మాట్లాడుతుండడా ఓ వ్యక్తి చెప్పు విసిరివేయడంతో గందరగోళం నెలకొన్నది. ఈ ఘటన తిరుప్పరన్కుంద్రమ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బుధవారం చోటుచేసుకొన్నది. ఈ దాడి నుంచి కమల్ తృటిలో తప్పించుకొన్నారు. దాంతో చెప్పు వెళ్లి సభకు హాజరైన ప్రజలపై పడింది.
కమల్ వాహనంపైకి చెప్పు విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వ్యక్తి దాడి వెనుక కారణమేమిటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడి ఘటనను పలు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఖండించారు. ఇటీవల కమల్ హాసన్ హిందూ టెర్రరిస్టు అనే వ్యాఖ్యల నేపథ్యంలోనే దాడి జరిగిందా అనే ప్రశ్న ఉత్పన్నమైంది.

ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో కమల్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి ఉగ్రవాది హిందువే. మహాత్మగాంధీని చంపిన నాథురాం గాడ్సే తొలి టెర్రరిస్టు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లోనే ఓటర్లను ఆకట్టుకొనేందుకే కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేశారనే వాదన వినిపించింది.
కమల్ వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో దుమారం రేపాయి. పలువురు కమల్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. హిందూ ఉగ్రవాది అంటూ వ్యాఖ్యలు చేసిన ఆయన క్రిస్టియన్ టెర్రరిస్టు, ముస్లిం టెరర్రిస్టు అని అనగలరా అని ప్రశ్నించారు. ఇటీవల బాలీవుడ నటుడు వివేక్ ఒబేరాయ్ కూడా కమల్ వ్యాఖ్యలు సరికావు అని అన్నారు.


Click it and Unblock the Notifications











