అసభ్యకర ఫోటోలతో వేధిస్తున్నారంటూ సింగర్ కంప్లైంట్
చెన్నై: తన ఫొటోను అసభ్యంగా చిత్రీకరించి ఇంటర్నెట్లో పెట్టారంటూ ప్రముఖ సినీ నేపథ్య గాయని చిన్మయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏమి మాయ చేసావే చిత్రంలో సమంతకు డబ్బింగ్ చెప్పి,కంటిన్యూగా ఆమెకు డబ్బింగ్ చెప్తున్న ఆమె సింగర్ కూడా పాపులర్. తమిళనాడులోనూ కన్నత్తిల్ ముత్తమిట్టాల్ తమిళ చిత్రంలో ఒరు దైవం తందపూవే పాట ద్వారా సినీ గాయనిగా చిన్మయి పరిచయమయ్యారు. గురువారం ఉదయం తల్లి పద్మాసినితో ఆమె పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చి రెండు ఫిర్యాదులు సమర్పించారు.

ఆ కంప్లైంట్ లో తన ఫొటోను అసభ్యంగా చిత్రించి, ట్విట్టర్లో హేయమైన వ్యాఖ్యలు చేశారన్నారు. ఆరుగురు వ్యక్తులకు ఇందులో సంబంధం ఉందని, ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఒకరని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత చిన్మయి విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల రాజకీయ, సినీ ప్రముఖులకు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయన్నారు. ఈ తరహా ప్రచారంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నామని ఆమె వ్యాఖ్యానించారు. తనను వేదనకు గురిచేసిన ఆరుగురి వివరాలు పోలీసులకు అందించానని, వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు.
రెండో కంప్లైంట్ విషయానికి వస్తే... విదేశాల్లో సంగీత కార్యక్రమాలు నిర్వహించే గజేంద్రకుమార్ తనకు రూ. 12 లక్షలు బాకీ ఉన్నారని తెలిపారు. డబ్బు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడని ఆరోపించారు. ఆ డబ్బు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
సన్ టీవిలో వచ్చే 'సప్తస్వరాంగల్' అనే సంగీత కార్యక్రమంలో పాల్గొని మంచి పేరు సంపాదించింది చిన్మయి. గాయకుడు శ్రీనివాస్ ఆమెను ఏ.ఆర్.రెహ్మాన్తో పరిచయం చేయించాడు. రెహ్మాన్ కంపోజింగ్లో వచ్చిన 'కన్నాతిల్ ముత మిట్టల్' లో 'ఒరు దేవమ్ తాంట పూవే' అనే పాటతో కెరీర్ను ప్రారంభించారు చిన్మయి. కొంత కాలంలోనే ఆమె తెలుగు, తమిళం, తులు, మళయాలం భాషలలో అనేక చిత్రాలకు గాత్రానందించారు. మంగళ్పాండే చిత్రంలో పాడటంతో ఆమె బాలీవుడ్లో కూడా తన కెరీర్ ప్రారంభించారు. ఒక సంవత్సరం తరువాత ఆమె 'గురు' చిత్రంలో 'తెరె బిన, మాయ్య' అనే పాటలకు మరింత గుర్తింపు వచ్చింది. ఆమె పాడిన పాటలలో సహానా, వారాయో, అన్బిల్ అవన్, కిలిమంజారో వంటి పాటలతో పాపులారిటీని సంపాదించింది. తెలుగులో ఆమె... ఏ దేవి వారము నీవో - అమృత (2002), కిన్గిని మింగిని- అల్లరి (2002), మేఘం కరిగెను - నాగ (2003) పాటలుతో బాగా పరిచయం.


Click it and Unblock the Notifications











