84 కోట్ల నష్టపరిహారం..చిక్కుల్లో ధనుష్ సినిమా.. ఇంతకీ ఏం జరిగిందంటే?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా మూవీ తేరే ఇష్క్ మే (తెలుగులో అమర కావ్యం). ఈ మూవీ గత ఏడాది నవంబర్లో థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీని ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించగా.. ఈ సినిమాను ఆయన సొంత నిర్మాణ సంస్థ 'కలర్ ఎల్లో ప్రొడక్షన్స్'నిర్మించారు. ఈ మూవీ నెల 23 నుంచి 'నెట్ఫ్లిక్స్' (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా చిక్కులు ఎదుర్కొంటుంది. సినిమాకు సంబంధించి రూ.84 కోట్ల నష్టపరిహారం కోరుతూ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఇంతకీ ఏమైందంటే?
అసలు వివాదానికి కారణం ఏమిటి?
ఈ వివాదానికి మూలకారణం 2013లో విడుదలైన సూపర్ హిట్ మూవీ 'రాంఝణా'(Raanjhanaa). ధనుష్-ఆనంద్ ఎల్. రాయ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాని ఈరోస్ ఇంటర్నేషనల్ (Eros International)నిర్మించింది. సుమారు రూ.35 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.105 కోట్ల వసూళ్లు సాధించి, భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సంబంధించిన అన్ని హక్కులు-కథ, పాత్రలు, సీక్వెల్ హక్కులు తమవేనని ఈరోస్ స్పష్టం చేస్తోంది.

ఈరోస్ ప్రధాన ఆరోపణలు
ఈరోస్ ఇంటర్నేషనల్ తన పిటిషన్లో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. 'తేరే ఇష్క్ మే'ను అధికారికంగా సీక్వెల్గా ప్రకటించకపోయినా, పబ్లిసిటీ ద్వారా అదే భావనను కలిగించారని ఆరోపించింది. అంతేకాదు, రెండు సినిమాల్లోనూ నటుడు మహ్మద్ జీషన్ అయ్యూబ్ ఒకే రకమైన పాత్రలో కనిపించడం, ధనుష్ పాత్ర 'శంకర్'కి 'రాంఝణా'లోని 'కుందన్' పాత్రకు పోలికలు ఉండటం కూడా కాపీరైట్ ఉల్లంఘనకు నిదర్శనమని ఈరోస్ పేర్కొంది. ఇవన్నీ తమ అనుమతి లేకుండానే జరిగాయని, 'రాంఝణా' బ్రాండ్ విలువను ఉపయోగించుకుని 'తేరే ఇష్క్ మే'కు లాభం చేకూర్చుకున్నారని ఆరోపిస్తూ రూ.84 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని కోర్టును కోరింది.
పాత విభేదాలే ఇప్పుడు మళ్లీ?
ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే గతేడాది 'రాంఝణా' రీ-రిలీజ్ సమయంలో కూడా ధనుష్, ఆనంద్ ఎల్. రాయ్, ఈరోస్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఒరిజినల్ సినిమాకు ఉన్న విషాదాంతాన్ని మార్చి రీ-రిలీజ్ చేయడంపై ధనుష్, దర్శకుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే విడుదలకు ముందు తమకు ఎలాంటి అభ్యంతరాలు తెలియజేయలేదని ఈరోస్ అప్పట్లో స్పష్టం చేసింది. ఇప్పుడు అదే సంస్థ కోర్టును ఆశ్రయించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
'తేరే ఇష్క్ మే' త్వరలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ నేపథ్యంలో కోర్టు కేసు సినిమా డిజిటల్ రిలీజ్పై ప్రభావం చూపుతుందా? లేక ఇది కేవలం న్యాయపరమైన ప్రక్రియకే పరిమితమవుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసుపై ధనుష్, ఆనంద్ ఎల్. రాయ్ లేదా కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. బాంబే హైకోర్టులో ఈ కేసు విచారణకు రానుండగా, రాబోయే రోజుల్లో తీసుకునే నిర్ణయం బాలీవుడ్లో కాపీరైట్, సీక్వెల్ హక్కులపై కీలక మైలురాయిగా మారే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి


Click it and Unblock the Notifications











