నిర్మాత అసత్య ప్రచారం, నేనే తప్పుకున్నా: ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ లొల్లిపై బాల
'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ 'వర్మ' మూవీ విషయంలో జరుగుతున్న వివాదంపై ఆ చిత్ర దర్శకుడు బాలా స్పందించారు. నిర్మాతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ సినిమా నుంచి తానే తప్పుకున్నట్లు వెల్లడించారు.
విక్రమ్ కుమారుడు 'ధృవ్'ను హీరోగా పరిచయం చేస్తూ బాల దర్శకత్వంలో గతేడాది 'వర్మ' షూటింగ్ మొదలైంది. అయితే షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఫైనల్ కాపీ చూసిన చిత్ర నిర్మాతలు (ఇ4 ఎంటర్టెన్మెంట్స్) తాము కోరుకున్న విధంగా రాలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ... కొత్త దర్శకుడు, కొత్త టెక్నీషియన్లతో సినిమా మళ్లీ తీయాలనే సంచలన నిర్ణయం తీసుకున్నారు.

డైరెక్టర్ బాల వివరణ
ఈ వివాదంపై బాల వివరణ ఇస్తూ ఓ స్టేట్మెంట్ విడుదల చేశారు. ‘వర్మ' చిత్ర నిర్మాతలు చెబుతున్న దాంట్లో నిజంలేదని, వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టే తాను తప్పనిసరిగా వివరణ ఇస్తున్నాను. క్రియేటివ్ ఫ్రీడమ్ కోసం నేను ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 22 జనవరి, 2019న నిర్మాతలతో జరిగిన ఒప్పంద పత్రాన్ని కూడా ఆయన రిలీజ్ చేశారు.

‘ధృవ్' కెరీర్ దృష్ట్యా ఈ గొడవను ముగిస్తున్నా
ఈ గొడవపై తాను మాట్లాడటం మొదలు పెడితే ‘ధృవ్' భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది. అందుకే ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నానని బాల తెలిపారు. అయితే గొడవ ఎందుకు వచ్చిందనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.

తేడా ఎక్కడ వచ్చింది?
బాల విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం... ‘వర్మ' మూవీ కథ విషయంలో ఏదో మార్పులు చేయాలని ప్రయత్నించారని, అయితే ఈ విషయంలో నిర్మాతలు, దర్శకుడి మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ గొడవ పెద్దగా అవ్వడం వల్లే... ‘వర్మ' చిత్రాన్ని కొత్త దర్శకుడితో రీ షూట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు టాక్.

బయట ప్రచారం మరోలా..
అయితే ఈ వివాదంపై ఇండస్ట్రీలో ప్రచారం మరోలా ఉంది. హీరో విక్రమ్ తన కుమారుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం కావడంతో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకే... ఇప్పటి వరకు తీసిన పుటేజీ మొత్తం పక్కన పెట్టేసి కొత్త దర్శకుడితో సినిమా రీ షూట్ చేయాలని నిర్ణయించారని, అవసరం అయితే తాను నష్టం భరిస్తానని హీరో విక్రమ్ ముందుకు వచ్చారని టాక్.


Click it and Unblock the Notifications











