‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ వివాదం... లీగల్ నోటీస్ పంపిన బాలా?
తెలుగులో సూపర్ హిట్ అయిన 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని తమిళం స్టార్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా 'వర్మ' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత బాలా దర్శకత్వంలో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోగా.. ఫైనల్ కాపీ చూసిన చిత్ర నిర్మాతలు (ఇ4 ఎంటర్టెన్మెంట్స్) తాము కోరుకున్న విధంగా సినిమా రాలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ... కొత్త దర్శకుడు, కొత్త టెక్నీషియన్లతో సినిమా మళ్లీ తీయాలనే సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
తెలుగు 'అర్జున్ రెడ్డి' చిత్రానికి సందీప్ రెడ్డి వంగా వద్ద అసిస్టెంటుగా పని చేసిన గిరీశయ్యను దర్శకుడిగా పరిచయం చేస్తూ మళ్లీ రీ షూట్ మొదలు పెట్టారు. ఇటీవలే ఈ షూటింగ్ పూర్తయింది. తాజాగా బాలా విక్రమ్కు లీగల్ నోటీసులు పంపినట్లు సమాచారం. తాను షూట్ చేసిన దాంట్లో నిర్మాత ఆదిత్య వర్మ టీం ఒక్క సీన్ కూడా వాడకూడదని అందులో పేర్కొన్నట్లు సమాచారం.

ఈ సినిమా నుంచి తప్పుకోవడంపై గతంలో బాల వివరణ ఇస్తూ ప్రెస్ స్టేట్మెంట్ విడుదల చేశారు. 'వర్మ' మూవీ నిర్మాతలు చెబుతున్న దాంట్లో నిజంలేదని, వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టే తాను తప్పనిసరిగా వివరణ ఇస్తున్నాను. క్రియేటివ్ ఫ్రీడమ్ కోసం నేను ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 22 జనవరి, 2019న నిర్మాతలతో జరిగిన ఒప్పంద పత్రాన్ని కూడా ఆయన రిలీజ్ చేశారు.
ఈ గొడవపై తాను మాట్లాడటం మొదలు పెడితే 'ధృవ్' భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది. అందుకే ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నానని బాల తెలిపారు. అయితే గొడవ ఎందుకు వచ్చిందనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications











