రిలీజ్ రోజే డైరక్టర్ పై దాడి...అపస్మారక స్థితి
చెన్నై : సినీ దర్శకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఈ సంఘటన కోలీవుడ్ వర్గాల్లో కలకలం రేకెత్తించింది. చెన్నై వడపళని అళగిరినగర్ 5వ మలుపు వీధికి చెందిన మనుకన్నన్(40) సినీ దర్శకుడు. ఆయన తెరకెక్కించిన 'అంకుశం' శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్ర మేనేజింగ్ ప్రొడ్యూసర్ కుమరన్, కారు డ్రైవర్ రాజేష్తో కలిసి మనుకన్నన్ షెనాయ్నగర్లోని ఓ ఏటీఎం వద్దకు వెళ్లారు.

ఆ సమయంలో చుట్టుముట్టిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై విచక్షణారహితంగా దాడి చేశారు. నాసికారంధ్రాల నుంచి రక్తం కారటంతో మనుకన్నన్ అపస్మారక స్థితికి చేరుకున్నారు. దుండగులను అడ్డుకోబోయిన మిగతా ఇద్దరూ గాయాలపాలయ్యారు. స్థానికులు వారిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మనుకన్నన్ను అత్యవసర చికిత్సా విభాగంలో చేర్చారు. అమింజికరై పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Click it and Unblock the Notifications











