ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. డైరెక్టర్ శంకర్ తల్లి కన్నుమూత!
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కలకలం సృష్టిస్తూనే ఉంది. మొదటి వేవ్ లో మరణాల సంఖ్య పెద్దగా లేకపోయినప్పటికీ ఈ రెండో వేవ్ మాత్రం మరణాల సంఖ్య కలవరపెడుతోంది. మరీ ముఖ్యంగా ఈ సెకండ్ వేవ్ లో భారీ ఎత్తున సినీ సెలబ్రిటీలు సైతం కరోనా బారినపడుతున్నారు. చాలామంది సెలబ్రిటీలు తమ ఆత్మీయులను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కనీసం రోజుకు ఒక సినీ సెలబ్రిటీ కి సంబంధించిన మరణ వార్త వెలుగులోకి వస్తూనే ఉంది.. తాజాగా దర్శకుడు శంకర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే

వివాదాల్లో శంకర్
ఈ మధ్య కాలంలో తమిళ దర్శకుడు శంకర్ పేరు అనేక విషయాల్లో బయటకు వస్తూనే ఉంది. చివరిగా ఆయన రజనీకాంత్ హీరోగా నటించిన రోబో 2.0 సినిమా తెరకెక్కించారు. గతంలో రోబో సినిమాకు సీక్వెల్ గా ఆ సినిమాని తెరకెక్కించారు శంకర్. ఈ సినిమా రిలీజ్ అయి కూడా దాదాపు నాలుగేళ్లు అవుతోంది. అయితే ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో పడి కొన్నాళ్ళకు విశ్వనటుడు కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా ప్రకటించారు.

ఇండియన్ 2 ఎఫెక్ట్
అయితే ఏ ముహూర్తాన ఈ సినిమా మొదలు పెట్టారో తెలియదు కానీ ఈ సినిమా మొదలుపెట్టినప్పుడే దగ్గర్నుంచి శంకర్ తో పాటు సినిమా యూనిట్ కి సైతం అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఉండగా భారీ క్రేన్ సెట్టింగ్ కూలిపోయి దర్శకత్వ భాగానికి చెందిన వ్యక్తులతో పాటు క్రేన్ ఆపరేటర్లు సైతం మరణించారు. అలా ఆగిపోయిన షూటింగ్ ను మళ్ళీ మొదలు పెట్టాలని ప్రయత్నాలు చేసినా అది సఫలం అవ్వలేదు.

వెంటనే రెండు సినిమాలు అనౌన్స్
షూటింగ్ మొదలు పెట్టాలని శంకర్ చాలా ప్రయత్నాలు చేశారు. కమల్ హాసన్ సహా లైకా ప్రొడక్షన్ సంస్థతో అనేక సంప్రదింపులు జరిపినా వారు ఆసక్తి చూపించకపోవడంతో శంకర్ వేరే కథలు సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. స్వతహాగా పేరున్న దర్శకుడు కావడంతో ఆయన వెంటవెంటనే సినిమాలు ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన దాదాపు రెండు సినిమాలు ప్రకటించారు.

చరణ్, రణవీర్ సింగ్ లతో సినిమాలు
దిల్ రాజు నిర్మాతగా రామ్ చరణ్ హీరోగా ఒక పాన్ ఇండియా సినిమా ఆయన ప్రకటించారు. ఈ సినిమాను దాదాపు ఐదు భాషల్లో నిర్మించాలని భావిస్తున్నారు. ఇక ఇది కాకుండా గతంలో తమిళ్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన అపరిచితుడు సినిమాని హిందీలో రణవీర్ సింగ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.. అయితే ఈ సినిమాలు ప్రకటించినప్పటి నుంచి లైకా ప్రొడక్షన్స్ శంకర్ మధ్య అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి.

లేఖాస్త్రాలు
తమ సినిమా పూర్తి చేయకుండా ఈ సినిమాలు పూర్తి చేయడానికి వీలు లేదని చెబుతూ తెలుగు ఫిలిం ఛాంబర్ సహా హిందీ ఫిలిం ఛాంబర్ కి సైతం ప్రొడక్షన్ సంస్థ లేఖలు రాసింది.. తమ సినిమా పూర్తి అయిన తరువాత మాత్రమే శంకర్ మీ సినిమాలు చేసుకునేలా అనుమతించాలని వారు లేఖల్లో కోరారు.

శంకర్ తల్లి కన్నుమూత
ఇక ఆ విషయం పక్కన పెడితే తాజాగా శంకర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. శంకర్ తల్లి ముత్తులక్ష్మి మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. అయితే వయోభారం రీత్యా ఆమె మరణించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముత్తులక్ష్మి వయసు 88 సంవత్సరాలు. ఇక ఆమె అంత్యక్రియలు బుధవారం నాడు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.
Recommended Video

విషాదంలో మునిగిపోయిన శంకర్ ఫ్యామిలీ
ఇక దర్శకుడు శంకర్ తల్లి చనిపోవడంతో తమిళ, తెలుగు సెలబ్రిటీల నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో శంకర్ కి తమ సంతాపం తెలియచేస్తున్నారు. నిజానికి తన తల్లి అంటే తనకు చాలా ఇష్టమని ఆమెతో చాలా క్లోజ్ గా ఉంటానని శంకర్ చాలా ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. ఇక శంకర్ తల్లి కోల్పోవడంతో శంకర్ కుటుంబం అంతా విషాదంలో మునిగిపోయింది.


Click it and Unblock the Notifications











