స్టార్ డైరెక్టర్ శంకర్కు ఈడీ షాక్ .. ఆ కేసులో ఆస్తులన్నీ జప్తు, ఎన్ని కోట్లంటే?
శంకర్ షణ్ముగం అంటే ఎవరికీ బల్బు వెలుగకపోవచ్చు కానీ.. డైరెక్టర్ శంకర్ అంటే ఆయన తీసిన సినిమాలన్నీ గుర్తొస్తాయి. భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. తన హై స్టాండర్డ్ సినిమాలు, భారీ విజువల్ ఎఫెక్ట్స్తో భారతీయ చిత్ర పరిశ్రను దశాబ్ధాల క్రితమే హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన ఘనత శంకర్ది. సామాజిక బాధ్యతకు కమర్షియల్ హంగులు అద్ది ఘన విజయాలు సాధించడం ఆయన స్టైల్. అలాంటి శంకర్ నేడు వరుస పరాజయాలతో కెరీర్ చివరికి చేరుకున్నారు.. ఈ నేపథ్యంలో ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది.
జెంటిల్మెన్ నుంచి నేటి గేమ్ ఛేంజర్ వరకు ఒకటే ఫార్ములాతో సినిమాలు తీస్తూ వచ్చారు శంకర్. తీసింది తక్కువ సినిమాలు అయినా తరతరాలు చెప్పుకునే పేరును సంపాదించారు. హీరోలు రాజ్యమేలే చిత్ర పరిశ్రమలో దర్శకుడికి స్టార్ స్టేటస్ను తెచ్చిన అరుదైన డైరెక్టర్గా , ఓ బ్రాండ్ను సృష్టించుకున్నారు. శంకర్ తీసే సినిమాల్లో అడుగడుగునా భారతీయత, దేశభక్తి కనిపిస్తాయి. అవినీతి, లంచగొండితనంపై విమర్శనాత్మక చిత్రాలు ఆయనకు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ తీసుకొచ్చింది.

ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ, రోబో, ఐ వంటి భారీ విజువల్ వండర్స్ను చిత్ర పరిశ్రమకు అందజేశారు శంకర్. టెక్నాలజీని అద్భుతంగా వాడగల దర్శకుల్లో శంకర్ ఒకరు. 90వ దశకంలో అందుబాటులో ఉన్న సాంకేతికతతో ఆయన అద్భుతాలు సృష్టించారు. జీన్స్ చిత్రంలోని ఒక పాటను ప్రపంచంలోని ఏడు వింతల వద్ద షూట్ చేస్తే సినీ జనాలు ముక్కున వేలేసుకున్నారు. కానీ అలాంటి దిగ్గజ దర్శకుడు నేడు వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు . స్నేహితుడు, భారతీయుడు 2, గేమ్ ఛేంజర్లు ఆయన ఇమేజ్ను డ్యామేజ్ చేశాయి.
మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా శంకర్కు ఇప్పుడున్న సమస్యలు చాలవు అన్నట్లుగా ఆయనకు ఈడీ షాకిచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం శంకర్కు చెందిన దాదాపు రూ.10 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. ఈ వివరాల్లోకి వెళితే.. తన జిగుబా కథను కాపీ చేసి శంకర్ రోబో సినిమాను తెరకెక్కించాడని ఆరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి ఎప్పుడో 14 ఏళ్ల క్రితం కేసు వేశాడు. కాపీరైట్, ఐటీపీ చట్టాలను శంకర్ ఉల్లంఘించారని పిటిషన్లో పేర్కొన్నాడు.
ఈ కేసు నడుస్తూ ఉండగానే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) రిపోర్ట్ కూడా శంకర్కు ప్రతికూలంగానే వచ్చింది. దీని ఆధారంగా శంకర్ కాపీ రైట్ యాక్ట్లోని సెక్షన్ 63ని ఉల్లంఘించినట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్ధారించింది. దీని ప్రకారమే శంకర్ ఆస్తుల్ని జప్తు చేసినట్లు తెలిపింది. శంకర్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్లుగా వార్తలు రావడంతో చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటికి రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











