బాపు చిత్రాల ఎడిటర్ కన్నుమూత
చెన్నై : తెలుగు, తమిళ భాషా చిత్రాలకు ఎడిటర్గా పనిచేసిన కె.ఎన్.రాజు (65) చెన్నైలో కన్నుమూశారు. తమిళనాడులోని పాళయంకోట్టైలో జన్మించిన ఆయన పూర్తిపేరు కె.నరసింహరాజు. తెలుగులో జాతర, రామాయణంలో సీత, కలలు కనే కళ్లు తదితర చిత్రాలకు పనిచేశారు. దర్శకుడు బాపూతో సన్నిహిత సంబంధాలుండటంతో ఆయన దర్శకత్వంలోని మిస్టర్ పెళ్లాం, రాంబంటు, పెళ్లికొడుకు, రాధాగోపాళం చిత్రాలకు రాజు పనిచేశారు.
గుండెపోటుతో మంగళవారం రాత్రి చెన్నై టీనగర్లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. చెన్నై దూరదర్శన్లో 1975 నుంచి 2012వ ఏడాది వరకు చీఫ్ ఎడిటర్, ఎడిట్ సూపర్వైజర్ హోదాల్లో పనిచేశారు. సెల్వ దర్శకత్వంలో తమిళంలో అమరావతి, ఎళావదు మనిదన్, శిష్యా, తలైవాసల్ సినిమాలకు కూడా పనిచేశారు.

ఆయన ప్రముఖ రచయిత రాజశ్రీకి అల్లుడు కాగా రాజు సతీమణి లక్ష్మి తెలుగు చిత్రపరిశ్రమలో మాటల రచయిత. కె.ఎన్.రాజు మృతి చెందారనే వార్త తెలిసిన వెంటనే ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఘంటసాల రత్నకుమార్, సినిమాటోగ్రాఫర్ సిద్ధార్థ్ తదితరులు ఆయన నివాసానికి చేరుకున్నారు.

రాజు భౌతికకాయానికి నివాళులర్పించి ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. అమెరికాలో ఉన్న రాజు కుమార్తె ఆర్తి పవన్కుమార్ చెన్నైకు బయలుదేరారని, గురువారం మధ్యాహ్నం కన్నమ్మపేటలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


Click it and Unblock the Notifications











