మద్యం మత్తులో హీరోయిన్ గదిలోకి..ఒంటరిగా ఉన్న సమయంలో.. మాలీవుడ్పై షకీలా సంచలన ఆరోపణలు
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్ధితులపై జస్టిస్ హేమ కమిటీ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. క్యాస్టింగ్ కౌచ్, మహిళలపై వేధింపులు వంటివన్నీ అన్ని భాషల్లో ఉన్నప్పటికీ.. మలయాళంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని హేమ కమిటీ పేర్కొంది. ఈ నివేదిక ఇచ్చిన బలంతో అనేక మంది నటీమణులు ధైర్యం తెచ్చుకుని ఇంతకాలంగా తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ఒక్కొక్కటిగా తెలియజేస్తున్నారు.
పెద్ద మనుషులుగా చెలామణి అవుతోన్న కొందరి నిజస్వరూపాలు ఈ రకంగా బయటకొస్తూ ఉండటంతో సినీ జనాలు నోరెళ్లబెడుతున్నారు. పలువురు మహిళా నటులను కలిసి వారి నుంచి కీలక సమాచారం రాబట్టింది హేమ కమిటీ . మలయాళ ఇండస్ట్రీ ఓ మాఫియా కనుసన్నల్లో నడుస్తోందని ఆరోపించింది. మహిళలు తమపై జరిగే లైంగిక దాడులపై నోరు విప్పలేకపోతున్నారని జస్టిస్ హేమ కమిటీ అభిప్రాయపడింది.

ఇదిలాఉండగా.. లైంగిక వేధింపులకు పాల్పడిన వారి వివరాలను బహిర్గతం చేయాలని ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (ఎఫ్ఈఎఫ్కేఏ) అనుబంధ దర్శకుల యూనియన్ డిమాండ్ చేసింది. మహిళల కోసం సినిమా సెట్లు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని దర్శకుడు ఆనంద్ ఇకర్షి సూచించారు. హేమ కమిటీ నేపథ్యంలో ఒకప్పుడు మలయాళ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన షకీలా సంచలన వ్యాఖ్యలు చేసింది.
అది కూడా మలయాళం గురించి కాకుండా పక్కనే ఉన్న తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలపై ఆమె ఆరోపణలు చేయడం కలకలం రేపింది. ఈ రెండు ఇండస్ట్రీలలో పరిస్ధితులు దారుణంగా ఉన్నాయని, ఇక్కడా కమీషన్ వేయాలని షకీలా డిమాండ్ చేసింది. హీరోయిన్ల గదుల్లోకి కొందరు వ్యక్తులు బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తారని ఆరోపించింది. రూపశ్రీ అనే ఓ నటి గదిలోకి నలుగురు వ్యక్తులు మద్యం సేవించి లోపలికి దూసుకెళ్లేందుకు యత్నించారని షకీలా ఆరోపించింది.

అలాగే తన మొదటి చిత్రంలో బికినీ వేసుకుని మేకప్ వేసుకుంటుండగా మేకప్ మేన్ అవసరం లేని చోట తాకాడని పేర్కొంది. కొందరు కాస్ట్యూమ్ డిజనర్లు తన కొలతలు తీసుకుంటూ అసభ్యంగా ప్రవర్తించారని షకీలా వెల్లడించారు. షకీలా వ్యాఖ్యలపై రూపశ్రీ వన్ ఇండియా తమిళ్కి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో స్పందించారు. షకీలా చెప్పిన కొన్ని అంశాలు నిజమే అయినప్పటికీ.. ఆ ఘటన లైంగిక వేధింపులు కాదని, కేవలం అపార్ధం వల్ల జరిగిందని రూపశ్రీ తెలిపారు.
తాను, షకీలా ఓ సినిమా చేస్తున్నప్పుడు ఓ రోజున సెట్లో ఒంటరిగా ఉన్నానని.. ఈ క్రమంలో కాల్షీట్లపై మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు గొడవ సృష్టించారని రూపశ్రీ పేర్కొన్నారు. షకీలా , ఆమె సోదరుడు జోక్యం చేసుకుని తనకు సహాయం చేశారని.. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదని, కేవలం గందరగోళం కారణంగా జరిగిందని రూపశ్రీ చెబుతున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలను తోసిపుచ్చిన ఆమె.. అలాంటి సమస్యలు ఎదుర్కోకుండానే ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని తేల్చి చెప్పింది.


Click it and Unblock the Notifications











