బతికుండగానే సినీ నటుడి శ్రద్దాంజలి పోస్టర్.. వారం తర్వాత నిజంగానే చనిపోయాడు
'అదిగో పులి' కథ చిన్నప్పుడు అందరూ వినే ఉంటారు. పులి లేకున్నా వచ్చినట్లు బాలుడు అబద్ధం ఆడడం.. ఆ తర్వాత నిజంగానే వచ్చినా ఎవరూ నమ్మక అతడు చనిపోవడం.. ఈ కథలో ఉంటుంది. ఈ కథలో అబద్ధాలు ఆడకూదడు అన్న నీతి ఉంటుంది. తాజాగా సరిగ్గా దానిని గుర్తు తెచ్చే విధంగా తమిళనాడులో ఓ సంఘటన జరిగింది. అయితే, అతడిని ఏ జంతువు చంపేయలేదు. కానీ, చనిపోయాడు. అది మరెవరో కాదు ఓ సినీ నటుడు. అవును.. ఓ సినీ నటుడు ఇదే తరహాలో చనిపోయాడు.
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కాయల్పట్టణంకు చెందిన ఆర్ఎస్ గోపాల్ షామియానా సప్లయర్స్ వ్యాపారం చేస్తున్నాడు. తన వ్యాపారానికి సంబంధించి అతను చేసే విన్నూత్న ప్రకటనలు బాగా పాపులర్ అయి, అతని వ్యాపారాభివృద్ధికి దోహదపడింది. గోపాల్కు ఇటీవల ఓ సినిమాలో విలన్గా నటించే అవకాశం దక్కింది. ఆ చిత్రంలో విలన్ మృతిచెంది శ్రద్ధాంజలి ఘటించే దృశ్యాలున్నాయి. ఇందుకోసం విలన్గా ఉన్న గోపాల్ ఫోటోతో కూడిన శ్రద్ధాంజలి పోస్టర్లు ఊరంతా వెలిశాయి.

ఈ పోస్టర్లను గమనించిన స్నేహితులు హూటాహుటిన గోపాల్ ఇంటికి చేరుకోగా, అది షూటింగ్లో భాగమేనని తెలిసింది. ఈ నేపథ్యంలో, గత శనివారం మళ్లీ గోపాల్ శ్రద్ధాంజలి పోస్లర్లు పట్టణంలో దర్శనమిచ్చాయి. దీనిని గమనించిన స్నేహితులు 'ఇది సినిమాలో భాగమేనంటూ' మిన్నకుండి పోగా, మరికొందరు మాత్రం సందేహించి గోపాల్ ఇంటికి ఫోన్ చేయగా, అనారోగ్యంతో ఆయన నిజంగా మృతిచెందినట్టు తెలిసింది. వారం క్రితం సరదాగా వేసిన పోస్టర్ అంతలోనే నిజం కావడం చర్చనీయాంశంగా మారింది. చనిపోయింది సినీ నటుడు కావడంతో ఈ విషయం తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం అయింది.


Click it and Unblock the Notifications











