‘‘మంచి జరుగాలంటే... ఆ ఇద్దరు స్టార్ హీరోలు చేతులు కలపాలి’’
తమిళ సినిమా రంగంలో మాత్రమే కాదు... తమిళనాడు బయటి సినీ ఇండస్ట్రీల్లో కూడా తమ హవా కొనసాగిస్తూ ప్రయాణం సాగించారు సూపర్ స్లార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్. వీరి పోటీ కేవలం సినిమా రంగానికే పరిమితం కాలేదు. తమిళనాడు రాజకీయాల్లో ఎంటరైన ఈ ఇద్దరూ ఎవరికి వారు సపరేట్ పార్టీలు స్థాపించారు. ప్రజలకు మంచి చేయాలనే ఒక మంచి ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నారు. అయితే ఈ ఇద్దరూ చాలా మంచి పని చేస్తున్నారు కానీ.. విడి విడిగా ఉండటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు అంటున్నారు నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, సినీ నటుడు విశాల్.

ఇద్దరూ చేతులు కలపాలి
త్వరలో లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి పోటీ చేయాలని నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, హీరో విశాల్ కోరారు. తన మనసులోని అభిప్రాయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా బయట పెట్టారు.

ఇద్దరూ కలిస్తేనే మంచి జరుగుతుంది
కమల్ సర్, రజనీ సర్ కలిసి రావాల్సిన అవసరం ఉంది... ఇది నడిగర్ సంఘం కోసమో, ఎవరైనా సినీ స్టార్ రిసెప్షన్ కోసమో, మల్టీ స్టారర్ మూవీ కోసమో కాదు... 2019 ఎన్నికల కోసం ఇద్దరూ కలిసి పని చేయాలి. దీని వల్ల తమిళ ప్రజలకు మంచి జరుగుతుంది అని విశాల్ అభిప్రాయ పడ్డారు.

తమిళనాడులో దారి తప్పిన రాజకీయం
తమిళనాడులో ఇప్పటి వరకు ఉన్న రాజకీయ పార్టీలు ఏవీ కూడా ప్రజల మంచి కోసం పాటు పడటం లేదని, సరైన మార్గంలో నడవటం లేదనే ఆలోచనలో ఉన్న ఈ ఇద్దరు స్టార్స్ ఏ పార్టీలోనూ చేయకుండా... సొంతగా రాజకీయ పార్టీలు స్థాపించిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ తన పార్టీకి ‘మక్కల్ నీది మయ్యం' అనే పేరు పెట్టగా, రజనీకాంత్ పార్టీకి ఇంకా పేరు పెట్టలేదు. ప్రస్తుతానికి ‘రజనీ మక్కల్ మండ్రమ్' అనే అభిమాన సంఘం పేరుతో రజనీ రాజకీయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

విశాల్ ఆశ నెరవేరేనా?
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రజనీకాంత్ ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్, కమల్ హాసన్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పని చేయాలనే విశాల్ కోరిక నెరవేరుతుందో.. లేదో?


Click it and Unblock the Notifications











