Jana Nayagan: దళపతి విజయ్కి షాక్.. ‘జన నాయగన్’ విడుదలపై ఉత్కంఠ..
Jana Nayagan: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ( Vijay) నటించిన అత్యంత ప్రతిష్ఠాత్మక సినిమా ' జన నాయగన్ (Jana Nayagan)'. ఈ మూవీ విడుదలపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కావాల్సిన ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం కావడంతో న్యాయపరమైన చిక్కుల్లో పడింది.ఈ వ్యవహారంపై మద్రాస్ హైకోర్టు జోక్యం చేసుకోవడంతో.. ఇప్పుడు మొత్తం సినిమా పరిశ్రమతో పాటు విజయ్ అభిమానుల దృష్టి అంతా కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?
డైరెక్టర్ హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన 'జన నాయగన్'ను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇప్పటికే సినిమా విడుదలకు సంబంధించిన థియేటర్ బుకింగ్స్, ప్రమోషన్స్, ఓవర్సీస్ స్క్రీనింగ్ ప్లాన్స్ అన్నీ దాదాపుగా అన్ని పనులు పూర్తి అయి, విడుదలకు సిద్దమైంది. అయితే.. చివరి నిమిషంలో సెన్సార్ అడ్డంకిగా మారింది. దీంతో నిర్మాతలకు పెద్ద షాక్ తగిలింది. ముఖ్యంగా ఇది విజయ్ పూర్తిగా రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు నటించిన చివరి సినిమా కావడంతో, అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

సెన్సార్ ఆలస్యం వెనుక కారణాలపై పరిశీలిస్తే.. జన నాయగన్ మూవీ మేకర్స్ సినిమాను డిసెంబర్ 18, 2025న సెన్సార్ బోర్డు ( CBFC)కి సమర్పించారు. ఎగ్జామినింగ్ కమిటీ కొన్ని చిన్న కట్స్, కొన్ని డైలాగ్లను మ్యూట్ చేయాలని సూచించింది. ఆ సూచనలను నిర్మాతలు అమలు చేసినప్పటికీ, అనూహ్యంగా జనవరి 5న ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి పంపుతున్నట్టు సెన్సార్ బోర్డు నుంచి సమాచారం అందింది. దీనికి కారణంగా మత భావాలు, సైన్యంపై షూటింగ్ చేశారని అనామక ఫిర్యాదు వచ్చిందని బోర్డు తెలిపింది.
అయితే, ఆ ఫిర్యాదు సినిమా చూడని వ్యక్తి నుంచి వచ్చిందని, అలాంటి ఫిర్యాదును ఆధారంగా తీసుకుని కొత్త కమిటీకి పంపడం సరికాదని నిర్మాతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. రూ.500 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిన భారీ సినిమా కావడంతో, ఇలాంటి ఆలస్యం వల్ల విడుదలపై మాత్రమే కాకుండా పైరసీ ప్రమాదం, ఓవర్సీస్ డీల్స్, అడ్వాన్స్ బుకింగ్స్పై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని వారు కోర్టుకు వివరించారు.
ఈ నేపథ్యంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ పి.టి. ఆశా ఈ పిటిషన్ను విచారించారు. నిర్మాతల తరఫున సీనియర్ న్యాయవాది పి.ఎస్. రామన్ వాదిస్తూ.. ఎగ్జామినింగ్ కమిటీ 4:1 మెజారిటీతో సర్టిఫికేట్ ఇవ్వాలని సిఫారసు చేసిందని తెలిపారు. ఓ అనామక ఫిర్యాదును ఆధారంగా చేసుకుని రివైజింగ్ కమిటీకి పంపడం చట్ట విరుద్ధమని ఆయన వాదించారు. ఇక సీబీఎఫ్సీ తరఫున అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఏఆర్ఎల్ సుందరేశన్ హాజరై తన వాదనలు వినిపించారు.
ఇరువైపుల విచారణ అనంతరం కోర్టు.. షాకింగ్ గా తన ఆర్డర్లను రిజర్వ్ చేస్తూ.. ఈ కేసుపై తుది తీర్పు జనవరి 9 ఉదయం వెలువడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఆసక్తికరంగా..'అవసరమైతే సినిమా విడుదలను జనవరి 10కి వాయిదా వేయవచ్చా?' అనే ప్రశ్నను కూడా కోర్టు లేవనెత్తింది. దీంతో విడుదల తేదీపై మరింత సస్పెన్స్ నెలకొంది.
సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం కారణంగా టికెట్ బుకింగ్స్పై ఇప్పటికే ప్రభావం కనిపిస్తోంది. తమిళనాడులో అడ్వాన్స్ బుకింగ్స్ నిలిచిపోగా, కొన్ని నగరాల్లో బుక్మైషో నుంచి 'బుక్ టికెట్స్' ఆప్షన్ను తాత్కాలికంగా తొలగించారు. అలాగే హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో డబ్బింగ్ వెర్షన్ల విడుదల కూడా తమిళ వెర్షన్ సర్టిఫికేషన్పైనే ఆధారపడి ఉండటంతో, పాన్ ఇండియా రిలీజ్కు ఇది పెద్ద అడ్డంకిగా మారింది.
ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో విజయ్ అభిమానుల్లో టెన్షన్తో పాటు ఆగ్రహం కూడా పెరిగింది. కొందరు ఇది రాజకీయ కుట్రేనని ఆరోపిస్తుండగా, విజయ్ పార్టీ టీవీకే నాయకులు కూడా సీబీఎఫ్సీ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి.. 'జన నాయగన్' భవితవ్యం ఇప్పుడు పూర్తిగా మద్రాస్ హైకోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉంది. జనవరి 9 ఉదయం వెలువడే తీర్పుతో సినిమా షెడ్యూల్ ప్రకారమే విడుదలవుతుందా? లేక సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవాల్సి వస్తుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దళపతి విజయ్ అభిమానులు మాత్రం ఉత్కంఠతో అదే తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











