Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
డా.డి. రామానాయుడు గారు నన్ను 'సోకత్తె' అనేవారు
చెన్నై: రామానాయుడు దేశం గర్వించదగ్గ నిర్మాత. ఆయన ప్రస్థానం మొదలైంది మాత్రం చెన్నపురిలోనే. ఆయనతో ఇక్కడ ఎంతో మందికి ఆత్మీయానుబంధం ఉంది. ఆయన లేరన్న వార్త చెన్నపురిలోని తెలుగువారికి దిగ్భ్రాంతి కలిగించింది. బాధాతప్త హృదయులైన పలువురు సినీప్రముఖులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు.ఈ 'సోకత్తె'ను పరిచయం చేసింది ఆయనే అని జయచిత్ర అన్నారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
జయచిత్ర మాట్లాడుతూ... రామానాయుడు పేరు వింటే మనసులో ఆత్మీయానుబంధం అల్లుకుంటుంది. 'సోగ్గాడు' సరసన ఈ 'సోకత్తె' (జయచిత్ర)ను తెలుగు తెరకు పరిచయం చేసింది ఆయనే. అప్పటికి నేను తమిళ సినిమాల్లో చాలా బిజీగా ఉన్నాను. నేను బాగా డ్యాన్స్ చేసేదాన్ని. నాయుడిగారికి అది బాగా నచ్చింది. నా ప్రతిభను గుర్తించి, పట్టుబట్టి నన్ను తెలుగు తెరకు పరిచయం చేశారు. అసలు తెలుగు పరిశ్రమ అంటే ఏంటో నాకు తెలియజెప్పింది ఆయనే. ఆయనలాంటి నిర్మాతను నేను చూడలేదు. సమయపాలన, కచ్చితత్వం, నాణ్యత ఆయన ప్రధాన సూత్రాలు. కథల ఎంపిక కూడా ఆయన పక్కా ప్రణాళికాయుతంగా చేస్తారు. సోగ్గాడు షూటింగ్లో ఆయన 'మా సోకత్తె' ఎక్కడా అంటూ నన్ను ఆత్మీయంగా పిలిచేవారు.
ఆర్టిస్ట్లంటే ఆయనకు అమితమైన గౌరవం. మంగళగిరి ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. వర్షాల వల్ల వారం రోజులు షూటింగ్ జరగలేదు. తెరపి ఇచ్చిన మరుసటి రోజు నాతో డ్యూయెట్ సాంగ్ చిత్రీకరించాల్సి ఉంది. ఆ రోజు మా తమ్ముడు పుట్టిన రోజు. నేను మా తమ్ముణ్ణి చూడాలని నాయుడిగారిని అడిగాను. ఆ రోజుల్లోనే ఆయన నా కోసం ప్రత్యేకంగా ఒక ఛార్టర్డ్ విమానం బుక్చేసి పంపించారు. ఆ రోజుల్లో అది చాలా ఖరీదైన విషయం. అయినా అవేమీ పట్టించుకోలేదు. ఈ సినిమాను రష్యన్ చిత్రోత్సవంలో ప్రదర్శించారు. అలా రష్యాకు నన్ను మొదటి సారి ఆయనే తీసుకెళ్లారు.
అక్కడ రాజ్కపూర్, శశికపూర్, రిషి కపూర్ లాంటి వారిని పరిచయం చేశారు. అక్కడ వేదికపైన భారతీయ నృత్యం ఎవరూ చేయకపోవడం లోటుగా గమనించిన నాయుడుగారు, మా హీరోయిన్ చేస్తుందయ్యా అంటూ నన్ను స్టేజీ ఎక్కించారు. నా డ్యాన్స్ చూసి రాజ్కపూర్గారు చాలా మెచ్చుకుని అక్కడ ఉన్న చాక్లెట్లు అన్నీ నాకు ఇచ్చారు. అక్కడ వారం రోజులకు మించి నేను ఉండటానికి వీలు కుదరలేదు. రామారావుగారి సినిమాకు కాల్షీటు ఉంది. ఒక కళాకారుడి కాల్షీటు ఎంత విలువైందో తెలిసిన నిర్మాత నాయుడుగారు.
నేను చెన్నైకి వెళ్లాలని అనగానే రష్యా నుంచి నేను క్షేమంగా చెన్నై చేరడానికి అన్ని ఏర్పాట్లు నాయుడుగారే చేశారు. ఆ విమానం మధ్యలో కాబూల్లో ఆగి వెళుతుంది. కాబూల్లో మెహ్రా అనే నిర్మాత వాళ్ల అమ్మాయిని విమానాశ్రయానికి పంపి నన్ను రిసీవ్ చేసుకుని ఆ పూట వాళ్లింట్లోనే బస చేసి మళ్లీ అదే విమానంలో బయలుదేరి దిల్లీకి, అక్కడి నుంచి చెన్నైకి చేరుకునే ఏర్పాట్లు చేశారు. నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఆయన్ను కలవకుండా వెళ్లేదాన్ని కాదు. నాకు ఎన్ని పనులున్నా సరే. ఆ మధ్య హైదరాబాద్లో శోభన్బాబుకు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు చివరిసారిగా ఆయన్ను కలిశాను.
టి.సుబ్బిరామిరెడ్డిగారి ఇంట్లో జరిగిన పెళ్లి విందు కార్యక్రమానికి వచ్చి ఆయన్ను కలవాలనుకుని కుదరక వచ్చేశాను. అయినా విమానాశ్రయంలో ఉన్నప్పుడు ఫోన్లో పలకరించాను. మా అబ్బాయితో మాట్లాడుతూ 'మీ అమ్మ పేరు కాపాడు' అంటూ చెప్పారు. ఆయనకు ఆరోగ్యం బాగోలేదని విన్నాను, కానీ ఇంత త్వరగా మనల్ని వదిలి వెళతారని అనుకోలేదు.
షూటింగ్లో ఎప్పుడూ ఆర్టిస్టులతో నవ్వుతూ కనిపిస్తారు, తప్ప ఆయనలో నేను కోపం చూసిన సందర్భాలు లేనే లేవు. అంత పెద్ద నిర్మాతయినప్పటికీ చాలా సాధారణంగా ఉంటారు. ఆర్టిస్టులకు కోరిన తిండి పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి. నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని అతికొద్ది మందిలో ఆయన ఒక్కరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అన్నారామె.