భాగ్యరాజా పార్థీవ దేహం చూసి.. భార్యను ఓదార్చలేక.. సీఎం విజయ్ కంటతడి!
తమిళ సినీ పరిశ్రమలో బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ దర్శకుడు, నటుడు, కథా రచయిత, స్క్రీన్ప్లే రచయిత కే. భాగ్యరాజ్ ఆకస్మిక మరణం యావత్ సినీ ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టింది. 73 ఏళ్ల వయసులో శనివారం ఉదయం గుండెపోటుతో చెన్నైలోని ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. దశాబ్దాల పాటు తమిళ చిత్ర పరిశ్రమకు ఎన్నో చిరస్మరణీయ చిత్రాలను అందించిన భాగ్యరాజ్ ఇక లేరన్న వార్తను అభిమానులు, సినీ ప్రముఖులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
భాగ్యరాజ్ మరణవార్త తెలిసిన వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే చెన్నైలోని భాగ్యరాజ్ నివాసానికి చేరుకుని ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం భాగ్యరాజ్ భార్య పూర్ణిమ, కుమారుడు శాంతను భాగ్యరాజ్తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఇప్పటికే ఎక్స్ వేదికగా సంతాప సందేశం విడుదల చేసిన సీఎం విజయ్.. భాగ్యరాజ్ మరణం తమిళ చిత్ర పరిశ్రమకు పూడ్చలేని లోటని పేర్కొన్నారు. దర్శకుడు, నటుడు, రచయిత, సంగీత దర్శకుడిగా ఆయన అందించిన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. గ్రామీణ జీవితం, కుటుంబ బంధాలు, హాస్యాన్ని అద్భుతంగా మిళితం చేసిన ఆయన చిత్రాలు తరతరాల ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. భాగ్యరాజ్ సినీ సేవలకు గౌరవ సూచకంగా ఆయన అంత్యక్రియలను పూర్తి రాష్ట్ర లాంఛనాలతో నిర్వహిస్తామని కూడా ప్రకటించారు.
ఇక భాగ్యరాజ్కు తుది వీడ్కోలు పలికేందుకు కోలీవుడ్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన మరణానికి నివాళిగా ఆదివారం తమిళనాడు వ్యాప్తంగా జరుగుతున్న అన్ని సినిమా షూటింగ్లను రద్దు చేస్తున్నట్లు తమిళ సినీ పరిశ్రమ అధికారికంగా ప్రకటించింది. నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు అందరూ ఆయన అంతిమయాత్రలో పాల్గొని చివరి నివాళులు అర్పించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.
భాగ్యరాజ్ కెరీర్ను పరిశీలిస్తే.. దర్శకుడిగా, నటుడిగా, రచయితగా ఆయన తమిళ సినిమాకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించారు. తనదైన కథన శైలి, సహజమైన హాస్యం, కుటుంబ విలువలను ప్రతిబింబించే కథలతో ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. కేవలం తమిళ ప్రేక్షకులకే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆయనకు విశేష ఆదరణ ఉంది. ఆయన సినిమాలు నేటికీ టెలివిజన్లో ప్రసారమైనప్పుడు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి.
ప్రస్తుతం చెన్నైలోని ఆయన నివాసానికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. చివరి చూపు కోసం అభిమానుల రద్దీ కొనసాగుతోంది. ఒక గొప్ప దర్శకుడు, గొప్ప కథకుడు, గొప్ప నటుడిని భారతీయ సినీ పరిశ్రమ కోల్పోయిందని పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. భాగ్యరాజ్ కాలం చేయడంతో ఓ యుగం ముగిసిందని, కానీ ఆయన సృష్టించిన చిత్రాలు, పాత్రలు, రచనలు మాత్రం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications




