Kamal Haasan వారిని కఠినంగా శిక్షించాలి.. కమల్ హాసన్ ఆగ్రహం
తుఫాన్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న తమిళనాడుకు మరోసారి వాతావరణ ముప్పు ఏర్పడింది. చెన్నైకి సమీపంలోని ఎన్నోర్ వద్ద సముద్ర జలాల్లోకి చమురు వ్యర్థ్యాలు భారీగా చేరుకోవడం మత్స్యకారుల జీవితాలకు ముప్పు ఏర్పడింది. ఈ వాతావరణ కాలుష్యానికి బాధ్యులైన వారిపై విలక్షణ నటుడు, మక్కల్ నీది మైయమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నోర్ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన మీడియాతో, మత్స్యకారులతో మాట్లాడుతూ..
చమురు వ్యర్థ్యాలను తొలగించడానికి సాంకేతిక పనిముట్లు గానీ, నిపుణులు గానీ లేరు. సముద్ర జలాల్లోని వ్యర్థ్యాలను తీసి వేయడానికి కేవలం మత్స్యకారుల సహాయంతో బకెట్లతో తొలగించడం దారుణం. ఇలా జరగడం మొదటి సారి కాదు. గతంలో చాలాసార్లు ఇలా జరిగింది. నేను ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాను. ప్రతీసారి పరిస్థితి మెరుగుపడుతుందని అనుకొంటాను. 7 ఏళ్లుగా పరిస్థితి ఇలానే ఉంది అని కమల్ హాసన్ అన్నారు.

చమురు వ్యర్థ్యాలు సముద్ర జలాల్లోకి రావడం కొనసాగుతూనే ఉంది. 17వ తేదీ లోపు చమురు వ్యర్ధాలను తొలగించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఇంకా 17 రోజులు గడువు ఇచ్చిన పరిస్థితి ఇలానే ఉంటుంది. బకెట్లతో ఎన్ని రోజులని తొలగిస్తారు. ఈ ముప్పును అరికట్టలేకపోగా.. ఒకరిపై మరొకరు నిందలు, ఆరోపణలు చేసుకొంటున్నారు అని కమల్ హాసన్ ఆరోపించారు.
ఎన్నోర్ మత్స్యకారుల జీవితాలకు ముప్పు ఏర్పడుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఈ సమస్యకు బాధ్యులెవరు? దారుణానికి ఎవరు బాధ్యత వహిస్తారు. ఈ నష్టానికి పరిహారం కట్టించడమే కాకుండా ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి అని కమల్ హాసన్ అన్నారు.


Click it and Unblock the Notifications











