‘భరత్ అనే నేను’ తర్వాత మరో భారీ ఛాన్స్ కొట్టేసిన కియారా?
'భరత్ అనే నేను' సినిమా ద్వారా సౌత్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తొలి సినిమా విజయంతో మరిన్ని పెద్ద ప్రాజెక్టుల్లో నటించే అవకాశం దక్కించుకుంటోంది. తాజాగా ఆమెకు తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.
తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం... అట్లీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కే విజయ్ తర్వాతి చిత్రం కోసం కియారాను సంప్రదించారట. అయితే ప్రస్తుతం ఈ ప్రతిపాదన చర్చల దశలో ఉందని, ఇంకా ఈ ప్రాజెక్టుకు సైన్ చేయలేదని టాక్. అయితే విజయ్ తమిళంలో పెద్ద స్టార్ కావడంతో ఆమె ఈ చిత్రాన్ని వదులుకునే అవకాశం లేదని అంటున్నారు.
కియారా ఆల్రెడీ మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సినిమాలో నటించి మంచి ఇంప్రెషన్ కొట్టేసింది. తమిళంలో విజయ్ లాంటి పెద్ద స్టార్ సినిమాలో కూడా నటిస్తే, ఆ సినిమా కూడా హిట్టయితే సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ రేంజికి వెళ్లడం ఖాయం.

విజయ్ ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ మూవీ 'సర్కార్' షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్. వరలక్ష్మి కూడా కీలకమైన పాత్ర పోషిస్తోంది. అట్లీ కుమార్ దర్శకత్వం వహించబోయే అతడి తర్వాతి చిత్రం జనవరి 2019లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
2014లో ఫగ్లీ మూవీ ద్వారా హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన కియారా అద్వానీ 'ఎంఎస్ ధోనీ' సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న ఈ ముంబై బ్యూటీ 'భరత్ అనే నేను' సినిమాతో సౌత్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆమె నటించిన నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'లస్ట్ స్టోరీస్' సీన్లు ఇటీవల లీక్ అవ్వడంతో అవి సెన్సేషన్ అవ్వడం... కియారా పాపులారిటీ మరింత పెరగడం తెలిసిందే.


Click it and Unblock the Notifications











