పవన్ కళ్యాణ్కి తమిళ సినీ పరిశ్రమ మద్దతు.. ఆ ఇద్దరి సినీ ప్రముఖుల ట్వీట్స్ ట్రెండింగ్
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అత్యంత ప్రతిష్టాత్మకం. ప్రశ్నించేందుకు రాజకీయాల్లోకి వచ్చానంటూ పదేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పవన్ జనసేనను స్థాపించారు. ఈ పదేళ్ల ప్రస్థానంలో ఎన్నింటిని చూసి కష్టాలకు ఓర్చుకుని జనసేనను ఈ స్థాయిలో నిలబెట్టారు పవర్స్టార్.
జగన్ దూకుడు ముందు ఒకానొక దశలో టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబే నిలబడలేకపోయారు. పవన్ నెగ్గుగురాగలరా అన్న అనుమానాలు నెలకొన్నాయి. జనసేన ఆర్ధిక పరిస్ధితి అంతంత మాత్రమే అయినా తన సొంత డబ్బును ప్రజల కోసం ఖర్చు పెట్టి , ప్రభుత్వంపై పోరాడుతూ ఎన్నికల నాటికి బలమైన శక్తిగా జనసేనను తయారుచేశారు పవన్.

ఈసారి ఎట్టి పరిస్ధితుల్లోనూ అసెంబ్లీలో జెండా పాతాలని ఫిక్స్ అయిన పవన్ కళ్యాణ్ అందుకు తగ్గట్లుగానే శ్రేణులను నడిపిస్తున్నారు. ఇప్పటంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని తేల్చిచెప్పారు. అంటే ఈసారి కూటమిలో భాగస్వామిని అవుతానని పవన్ క్లారిటీ ఇచ్చి.. టీడీపీతో జట్టు కట్టి, బీజేపీ పెద్దలను సైతం ఒప్పించారు. కూటమి అభ్యర్ధుల విజయమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు జనసేనాని.
ఇక పవన్ కళ్యాణ్ .. పిఠాపురం నుంచి స్వయంగా బరిలో దిగారు. గత ఎన్నికల్లో మాదిరిగా భీమవరం, గాజువాకల నుంచి కాకుండా ఒకే స్థానం నుంచి పోటీదిగాలని ఆయన నిర్ణయించారు. పవన్ విజయం కోసం జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు శ్రమిస్తున్నాయి. మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయిథరమ్ తేజ్ .. జబర్దస్త్ ఆర్టిస్టులు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రాంప్రసాద్, గెటప్ శ్రీను తదితరులు పిఠాపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
పవన్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి తన మద్ధతు తెలిపారు. తన తమ్ముడు లాంటి నేత చట్టసభల్లో వుండాల్సిన అవసరం వుందన్నారు. అధికారం వున్నా , లేకున్నా పవన్ ఎంతోమందికి సాయం చేశాడని.. ఆయన గొంతు అసెంబ్లీలో వినిపించాలని చిరు ప్రజలను కోరారు. ఆ వెంటనే స్టార్ హీరోలు రాంచరణ్, అల్లు అర్జున్లు సోషల్ మీడియా ద్వారా పవన్కు, కూటమికి తమ సపోర్ట్ ప్రకటించారు. టాలీవుడ్ నుంచి హీరో నాని, సంపూర్ణేష్ బాబులు కూడా పవన్కు అండగా నిలిచారు.
ఇదిలావుండగా.. తమిళ చిత్ర పరిశ్రమ నుంచి కూడా పవన్ కళ్యాణ్కు మద్ధతు లభిస్తోంది. సలార్ ఫేమ్ శ్రీయారెడ్డి ఆయనకు అండగా నిలిచారు. ఆయన కోరుకున్నది జరగాలని, పవన్కు విజయం దక్కాలని.. గాజు గ్లాసుకు ఓటేయాలని శ్రీయారెడ్డి ట్వీట్ చేశారు. ఆమె ప్రస్తుతం సలార్ 2లో కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే పవన్-సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న 'ఓజీ'లో డిఫరెంట్ షేడ్స్ వున్న క్యారెక్టర్లో శ్రీయారెడ్డి కనిపించనున్నారు.
మరోవైపు.. ఒకప్పటి అగ్రకథానాయిక, చిరంజీవికి హిట్ పెయిర్గా గుర్తింపు తెచ్చుకున్న రాధిక శరత్ కుమార్ సైతం పవన్కు సపోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు.. మీ సేవ ప్రజలకు మరింత బలం చేకూర్చాలని కోరుకుంటున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నికలకు రేపు ఒక్కరోజే గడువు వుండటంతో మరింత మంది సినీ ప్రముఖులు పవన్కు మద్ధతు తెలుపుతారేమో చూడాలి.


Click it and Unblock the Notifications











