మణిరత్నం 'రావణ్' లో ప్రసవవేదన కోసం...
మణిరత్నం తాజా చిత్రం 'రావణ్' టీజర్ రెండు రోజుల క్రితం రిలీజై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ చిత్రంలో కీలక సన్నివేశం కోసం మణిరత్నం ఈ మధ్యన ఓ ప్రసవ వేదన సన్నివేశం చిత్రీకరించారు. దానికోసం ఆయన శ్రమించిన విధానం బాలీవుడ్లో ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. ఆవు ప్రసవించే సన్నివేశం చిత్రీకరించడానికి దాదాపు పది గంటల పాటు మణిరత్నం శ్రమించారు. అందుకోసం ఇరవై గర్భస్థ ఆవులను సిద్ధం చేయించారు. మరో 15 రోజుల్లో ప్రసవానికి సిద్ధంగా ఉన్న ఆవుల్ని ఎంపిక చేసి మధ్యప్రదేశ్లోని ఓ ప్రాంతంలో పాక వేసి సంరక్షించారు. ఇక ప్రసవ తేదీ దగ్గరకు వచ్చిందని తెలియగానే..ఆ రోజు ఉదయం ఆరు గంటల నుంచే యూనిట్ మొత్తం ఆ పాక దగ్గరకు చేరి కెమెరాల్ని సిద్ధం చేసింది.
ఏ ఆవు ముందు ప్రసవిస్తుందో తెలియకపోవడంతో దాదాపు అన్నింటినీ కెమెరాలకు అందుబాటులో ఉంచి ఎదురుచూశారు. పది గంటల తరవాత ఓ తెల్ల ఆవు ప్రసవించింది. దాన్ని కెమెరాలో బంధించారు. 'రావణ్'లో ఈ సన్నివేశాన్ని వాడబోతున్నారు. కథలోని ఓ కీలక సన్నివేశం కోసం ఈ ఘట్టాన్ని చిత్రించారని తెలిసింది. అభిషేక్ మాట్లాడుతూ "ఈ సన్నివేశం కోసం అందరం ఎంతో ఓపిగ్గా నిరీక్షించాం. ఈ సన్నివేశం కోసం వేచి చూసే సమయంలో ఏ మాత్రం అలికిడి చేయకుండా ఉండాల్సి వచ్చింది" అన్నారు. ఆవు ప్రసవించగానే అభి చప్పట్లు చరుస్తూ "మన సెట్లోకి ఓ బేబీ వచ్చింద"ని హడావిడి చేశారట. ఇక ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, విక్రమ్, ప్రియమణి ప్రధాన పాత్రధారులు.


Click it and Unblock the Notifications











