రేప్ మాత్రమే లైంగిక నేరం కాదు, అలా చేసినా నేరమే: నాని హీరోయిన్
నాని హీరోగా తెరకెక్కిన 'జెర్సీ' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బెంగుళూరు బ్యూటీ శ్రద్దా శ్రీనాథ్ తొలి ప్రయత్నంలోనే విజయం అందుకున్నారు. ఈ మూవీ తర్వాత ఆమె తమిళంలో అజిత్ ప్రధాన పాత్రలో రూపొందిన 'నెర్కొండ పార్వాయ్' చిత్రంలో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో పాటు ఇందులో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలు లాంటి అంశాలు చర్చిస్తూ తెరకెక్కిన ఈ మూవీ హిందీలో విజయం సాధించిన 'పింక్' చిత్రానికి రీమేక్.

అత్యాచారాన్ని(రేప్) మాత్రమే లైంగిక నేరంగా భావిస్తున్నారు
తాజాగా శ్రద్ధా శ్రీనాథ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సమాజంలో మహిళలపై జరిగే నేరాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. మహిళలపై జరిగే లైంగిక నేరాల గురించి ఇప్పటికీ సమాజంలో సరైన అవగాహన లేదని, కేవలం అత్యాచారాన్నిరేప్) మాత్రమే లైంగిక నేరంగా భావిస్తున్నారు' అని చెప్పుకొచ్చారు.

తప్పుడు ఉద్దేశ్యంతో స్త్రీని సంప్రదించడం కూడా లైంగిక నేరమే
"తప్పుడు ఉద్దేశ్యంతో స్త్రీని సంప్రదించడం కూడా లైంగిక నేరమే. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మహిళలు పోలీస్ స్టేషన్ వెళ్ల ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు. తల్లిదండ్రులు, సమాజం వీటిని ఎలా స్వీకరిస్తారో? కోర్టుల్లో ఈ కేసులు ఆలస్యం అవుతాయనే కారణంతో చాలా మంది వెళ్లడం లేదన్నారు.

అలాంటి ప్రశ్నలు అడగవద్దు
‘లైంగిక వేధింపులు జరిగినపుడు ఆ వ్యక్తి ఎక్కడ తాకాడు, ఎలా తాకాడు అనే ప్రశ్నలు అడగటం మానేయాలని, అలా అడగటం వల్ల బాధితులు ఇబ్బంది పడతారు. ఇలాంటి విషయాల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. మహిళల్లో చాలా మార్పు వస్తోంది, కానీ వారిపై ఉండే ఆలోచన విధానంలో మార్పు రావడం లేదు' అని శ్రద్ధా శ్రీనాథ్ చెప్పుకొచ్చారు.

నాకు పిల్లలు అవసరం లేదు
మరో ప్రశ్నకు స్పందిస్తూ తనకు పిల్లలను కనే ఆలోచన లేదని తెలిపారు. నా గ్రాండ్ పేరెంట్స్కు 15 మంది పిల్లలు ఉన్నారు. నా తల్లిదండ్రులకు 2 పిల్లలు ఉన్నారు, నాకు సంతానం అవసరం లేదు. నా నిర్ణయాల ఆధారంగా ఎవరూ నన్ను జడ్జ్ చేయకూడదు. నా జ్ఞానం, విద్య మాత్రమే నన్ను జడ్జ్ చేసే ప్రమాణాలుగా ఉండాలి" అని శ్రీనాథ్ అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











