ట్వీట్ ఎఫెక్ట్ :నీతూచంద్రపై నిషేధం
చెన్నై: నీతూ చంద్ర పై నిషేధం పెట్టాలని తమిళ తంబీలు డిమాండ్ చేస్తున్నారు. నీతూచంద్ర వివాదస్పద వ్యాఖ్యలు చేసి తమిళుల ప్రేక్షకుల ఆగ్రహానికి గురైంది. వివరాల్లోకి వెళితే...వివాదస్పద చిత్రం 'మద్రాస్ కేఫ్' గురించి ట్విట్టర్ లో....నీతూ పాజిటివ్గా స్పందించడంతో తమిళ అభిమానులు ఆమెపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆమెపై బ్యాన్ పెట్టాలని వారు కోరుతున్నారు.
ఆ ట్వీట్ లో... ''వావ్' చిత్ర దర్శకుడు సుజిత్ సర్కార్, హీరో జాన్ అబ్రహాం, వాళ్ల టీమ్కు హ్యాట్సాఫ్. ఇలాంటి సినిమా తప్పకుండా చూడాలి' అని నీతూ చంద్ర ట్విట్టర్లో ట్వీట్ చేసింది. ఇలా ట్వీట్ చేయడం ఆమె అభిమానుల్లో చాలా మందిని నిరాశకు గురిచేసింది. తమిళ ప్రజల మనోభావాలను గాయపరిచిన ఆమెను తమిళ చిత్రాల్లో నిషేదిస్తామని కూడా హెచ్చరించారు.
ఈ విషయమై నీతూచంద్ర స్పందిస్తూ ' నా అభిమానుల నుంచి నాకు మెయిల్స్, మెసేజ్లు వచ్చాయి. 'మద్రాస్ కేఫ్'కు నేను అనుకూలంగా ఉండటం వారిని ఆప్సెట్కు గురిచేసింది. సినిమా చూడకుండా నా పట్ల ఇలా స్పందించడం సరైన పద్దతి కాదు. సినిమా చూడకుండానే అనవసరపు ఊహగానాలతో రాద్ధాంతం చేసే వారి జాబితాలో చేరవద్దని ఆశిస్తున్నాను. ఈ సినిమాని తమిళ సెన్సార్ బోర్డ్ కూడా అనుమతించింది. కనీసం వాళ్లనయినా మీరు నమ్ముతారని ఆశిస్తున్నా. సుజిత్ సర్కార్ బాధ్యత కలిగిన దర్శకుడు. తన దేశ ప్రజల మనోభావాల్ని గాయపరచాలని ఆయనెన్నడూ భావించడు' అని తెలిపింది.
అయితే 'విశ్వరూపం', 'తలైవా' చిత్రాల విషయంలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు 'మద్రాస్ కేఫ్' విషయంలో కనిపించడం లేదు. కేవలం అనువాద చిత్రం కావడంతో సాధారణ ప్రేక్షకులు ఈ వివాదాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. కానీ, ఈలం తమిళుల మద్దతుదారులందరూ ఏకకంఠంతో ఈ చిత్రాన్ని శాశ్వతంగా నిషేధించాలని గళమెత్తుతున్నారు. నామ్ తమిళర్ కట్చి, ఎండీఎంకే వంటి పార్టీలతోపాటు విద్యార్థులు సైతం వ్యతిరేకంగా ఆందోళనలకు దిగడంతో 'మద్రాస్ కేఫ్' ప్రదర్శనను నిలిపివేయక తప్పలేదు. కాగా, బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం, నర్గిస్ ఫక్రి జంటగా నటించిన ఈ చిత్రానికి సూర్జిత్ సర్కార్ దర్శకత్వం వహించారు.
భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈలం తమిళులను కించపరిచే విధంగా తెరకెక్కించిన 'మద్రాస్ కేఫ్' చిత్రాన్ని ఒక్క తమిళనాడులోనే కాకుండా, దేశవ్యాప్తంగా నిషేధించాలని డిమాండ్ చేశారు. 'మద్రాస్ కేఫ్' సినిమాలో ఈలం పులుల గురించి తప్పుగా చూపించారని, ఆ సినిమా వాస్తవానికి విరుద్ధంగా వుందని ఎండీఎంకే నేత వైగో ధ్వజమెత్తారు. శుక్రవారం బన్రూట్టిలో జరిగిన ఎండీఎంకే కార్యకర్త వివాహానికి హాజరైన వైగో విలేఖరులతో మాట్లాడుతూ... తమిళ జాతి కోసం అశువుల బాసిన పులుల గురించి తప్పుగా చిత్రీకరించిన ఆ సినిమాను శాశ్వతంగా నిషేధించాలని డిమాండ్ చేశారు. బీజేపీ వంటి పార్టీలు కూడా ఆ సినిమాను తప్పు బడుతున్నాయని గుర్తు చేశారు. తమిళులను ఊచకోత కోసిన శ్రీలంక ప్రభుత్వం నిర్వహిస్తున్న కామన్వెల్త్ సదస్సుకు భారత్ హాజరుకాకూడదని ఈ సందర్భంగా వైగో డిమాండ్ చేశారు.


Click it and Unblock the Notifications












