లక్షల మంది చనిపోతున్నారు: దయచేసి సినిమాలో అలాంటి సీన్లు వద్దు!
సినిమాల్లో పొగతాగే సన్నివేశాలను నిషేధించాలని కొంతకాలంగా పోరాటం చేస్తున్న తమిళనాడుకు చెందిన పాట్టాలి మక్కల్ కచ్చి అధ్యక్షుడు డాక్టర్ రామదాస్ తాజాగా నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్కు లేఖ రాశారు. తమిళ సినిమాల్లో నటించే నటులందరూ తమంతట తాముగా పొగతాగే సన్నివేశాల్లో నటించడం మానేయాలని కోరారు.
యువతను పడదరి పట్టిస్తున్న ఇలాంటి సన్నివేశాల్లో నటించబోమని రజనీకాంత్, కమల్హాసన్, అజిత్, విజయ్ వంటి స్టార్స్ గతంలో మాట ఇచ్చారు. అయితే ఇపుడు ఇచ్చిన మాటను తప్పి మళ్లీ అలాంటి సన్నివేశాల్లో నటిస్తున్నారని రామదాసు తన లేఖలో పేర్కొన్నారు.
పొగతాగడం వల్ల దేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 12 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, తమిళనాడులో ఆ సంఖ్య లక్షకుపైగా ఉందన్నారు.
ధూమపానం సేవించే వారికన్నా, ఆ పొగ ఆడవాళ్లు, పిల్లలపైన ఎక్కువ ప్రభావం చూపుతుందని తెలిపారు. ఇన్ని నష్టాలు ఉన్న ధూమపానాన్ని ఎంకరేజ్ చేసే విధంగా సినిమాల్లో సన్నివేశాలు ఉండటం సరైంది కాదు అన్నారు.

విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కార్' మూవీ ప్రమోషన్స్ జూన్లో మొదలైనపుడు తొలిసారి రామదాస్ పేరు తెరపైకి వచ్చింది. అప్పట్లో ఆయన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లో విజయ్ స్టైలిష్గా స్మోక్ చేస్తూ కనిపించడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకెక్కారు. ఆయన పోరాటం ఫలితంగా యువతను పెడదారి పట్టించే విధంగా ఉన్న ఆ పోస్టర్లను తొలగించారు.
తాజాగా 'సర్కార్' సినిమా విడుదలైన తర్వాత మరోసారి రామదాస్ సినిమాల్లో ధూమపానం అంశంతో మరోసారి మీడియా ముందుకు వచ్చారు. 'సర్కార్' మూవీలో పలు సందర్భాల్లో పొగతాగే సన్నివేశాలు ఉన్నాయని, మొత్తం 22 సార్లు ఇలాంటి దృశ్యాలు కనిపించాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజానికి, యువతకు చెడు సంకేతాలు ఇస్తున్న ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో ఉండకూడదని, దీనిపై తమిళ నటులు సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.


Click it and Unblock the Notifications











