సినిమా టికెట్ల ధర పెంచి దోపిడీ చేస్తున్నారంటూ...పిల్
చెన్నై: ప్రస్తుతం సినిమా టికెట్ల ధరలు ఎంత ఎక్కువగా ఉన్నయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక మల్టీ ప్లెక్సుల్లో సినిమాలు చూడటం అంటే సామాన్యుడు భయపడే పరిస్థితి. సినిమా థియేటర్లలో టికెట్ల ధరలు ఎక్కువగా ఉండటం వల్లనే పైరసీ వ్యాపారం రోజు రోజుకు పెరుగుతోందనే వాదన కూడా ఉంది.
ఇలాంటి పరిణామాల నేపథ్యంలో.... సినిమా టికెట్ల ధరలు భారీగా వసూలు చేయడంపై మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాజ్యం(పిల్) దాఖలైంది. చెన్నైలో సినిమా హాళ్లు ప్రభుత్వ నిబంధనల కంటే అధిక ధరను వసూలు చేస్తున్నాయని, అలా చేయడం వందల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జిస్తున్నాయని పేర్కొన్నారు. దేవరాజన్ అనే వ్యక్తి ఈ పిల్ దాఖలు చేసారు.

తమిళనాడు ప్రభుత్వం 2009 మే 20న జారీ చేసిన జీవో ప్రకారం సినిమా హాళ్లు టికెట్ ధర 120 రూపాయలకు మించి వసూలు చేయకూడదని, అయితే తన నుంచి ఓ సినిమా హాలు టికెట్ ధరగా 200 రూపాయలు వసూలు చేసిందని, ఇలా అందరి వద్ద అధికంగా వసూలు చేయడం ద్వారా ఏటా దాదాపు 400 కోట్ల రూపాయలు ప్రజల నుంచి దోచుకుంటున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
దేవరాజన్ దాఖలు చేసిన పిల్ ను మద్రాసు హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషనర్ ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కు న్యాయస్ధానం నోటీసులు జారీ చేసింది.


Click it and Unblock the Notifications











