హీరో, హీరోయిన్లు కలిసి మద్యంమత్తులో??
చెన్నై : ఇటీవల విడుదలైన కొత్త చిత్రాలు 'జిగర్దండా', 'వేలయిల్లా పట్టదారి' చిత్రాల్లో ధూమపాన సన్నివేశాలపై పీఎంకే వ్యవస్థాపకులు రామదాసు మండిపడ్డారు. ఆయన సోమవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. చలన చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలు సమాజాన్ని చెడువైపు మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల కొన్నింటిలో అల్లర్లు, మద్యం తాగడం, ధూమపానం వంటి సన్నివేశాలు అధికంగా ఉంటున్నాయని ఆరోపించారు.

హీరో, హీరోయిన్లు కలిసి మద్యంమత్తులో నృత్యం చేస్తున్నట్లు కూడా చూపుతున్నారని తెలిపారు. గతంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి పదవిలో ఉన్న అన్బుమణి రామదాసు చలన చిత్రాల్లో ఈ తరహా సన్నివేశాలను ప్రదర్శించడానికి కొన్ని నిబంధనలు విధించినట్లు తెలిపారు.
అన్బుమణి రామదాసు సూచన మేరకు రాష్ట్రంలోని సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్హాసన్, సూర్య, విజయ్ తదితరులు తమ చిత్రాల్లో ధూమపాన సన్నివేశాల్లో నటించబోమని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. మంచి చిత్రాలను ప్రోత్సహిస్తానని పేర్కొన్నారు. యువతను చెడుమార్గంలోకి పంపేలా చిత్రాలు ఉంటే తమ పార్టీ భారీ ఎత్తున నిరసన తెలుపుతుందని హెచ్చరించారు.


Click it and Unblock the Notifications











