'విశ్వరూపం' వివాదంపై ప్రకాష్ రాజ్ స్పందన
చెన్నై : 'విశ్వరూపం' చిత్రాన్ని డీటీహెచ్లో ప్రసారం చేయాలన్న కమల్హాసన్ నిర్ణయంపై నేను ఏకీభవిస్తాను. కమల్ తీసుకున్న నిర్ణయం చాలా ముఖ్యమైనది. దీన్ని ఆహ్వానిస్తున్నాను. నేనో సినిమా తీశాను... థియేటర్కొచ్చి చూడండి అంటూ చాలాకాలంగా పరిశ్రమ వాళ్లు జనాల్ని పిలిపించుకుంటున్నారు. వారంతా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మేము ప్రేక్షకుల నుంచి కేవలం డబ్బులే కాదు, రెండున్నర గంటల సమయాన్ని కూడా తీసుకుంటున్నాము. డబ్బుకన్నా సమయం చాలా విలువైనది. అందుకే వినియోగదారులను వెతుక్కుంటూ పిజ్జా, మసాలా దోసెల్ని ఇంటింటికీ పంపుతున్నారు. ఆ సూత్రాన్నే కమల్హాసన్ అనుసరిస్తున్నాడు అన్నారు.
అలాగే ఛాటింగ్ ద్వారా లండన్లోని ఓ తమిళ యువకుడు ఇటీవల నన్ను సంప్రదించాడు. ''సర్.. మీ 'ధోని' చూశాను. చాలా బాగుంది'' అన్నాడు. 'ధోని' అక్కడ విడుదల చేయలేదే? ఎలా సాధ్యమైందని అడిగాను. 'చిత్రాన్ని వెంటనే చూడాలని ఆశపడ్డాను. ఒక తమిళ సినిమా ఇక్కడికి రావాలంటే మూడు నెలలు పడుతుంది. థియేటర్కు వెళ్లాలంటే నేనున్న చోటునుంచి 200 కి.మీ. ప్రయాణించాలి. అందుకే పైరసీ సీడీ తెప్పించుకున్నాన'ని నిజాయతీగా చెప్పాడు. అలాంటివారు చాలామంది ఉన్నారు. రెండున్నర గంటల కోసం ఐదారు గంటలు వెచ్చించే సమయం లేక చాలామంది సినిమాలకు దూరంగా ఉన్నారు. అలాంటి వారిలో కమల్హాసన్ వినూత్న విధానం చిత్రాలపై ఆసక్తిని పెంచుతుంది అని చెప్పుకొచ్చారు.
ఇక తను తెరకెక్కిస్తున్న చిత్రం గురించి చెప్తూ.. ఇటీవల 'సాల్ట్ అండ్ పేపర్' అనే మలయాళ సినిమా చూశాను. అందమైన ప్రేమకథ. మధ్య వయసులో వచ్చే ప్రేమ ప్రధానాంశం. ప్రేమలోని మరో కోణాన్ని ఇందులో చూపారు. ఈ కథను తీసుకుని 'ఉన్ సమయలరయిల్' పేరిటతమిళంలో తెరకెక్కిస్తున్నాను. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. తెలుగులోనూ ఏకకాలంలో విడుదల చేస్తాము అన్నారు.
ప్రభుదేవా, నయనతార విడిపోవటం విషయమై మాట్లాడుతూ... వారిద్దరూ ఒకరినొకరు చాలా ఇష్టపడ్డారు. స్నేహితుడిగా వారికి అండగా నిలిచాను. వ్యక్తిగత కారణంగా దూరమయ్యారు. అది కూడా వారిద్దరి మంచికోసమే విడిపోయారు. ఇప్పుడా విషయంలో నేనేమీవ్యాఖ్యానించదలచుకోలేదు అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











