Rajini 171: సౌత్ ఇండియాలో సెన్సేషనల్ కాంబో.. యాక్షన్ డైరెక్టర్తో రజినీకాంత్
తమిళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకున్న ఏకైక హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ఇదే రీతిలో దూసుకుపోతోన్న ఆయన.. వరుస చిత్రాలతో అలరిస్తున్నారు. అయితే, ఈ మధ్య కాలంలో ఈ సీనియర్ హీరోకు హిట్లు రాలేదు. ఈ పరిస్థితుల్లోనే ఇటీవలే రజినీకాంత్ 'జైలర్' మూవీతో వచ్చారు. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏకంగా రూ. 600 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సెన్సేషనల్ హిట్గా నిలిచింది. దీంతో సూపర్ స్టార్లో జోష్ రెట్టింపు అయింది.
వాస్తవానికి 'జైలర్' మూవీ పట్టాలపై ఉన్న సమయంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ తన కొత్త సినిమాలను కూడా ఒక్కొక్కటిగా లైన్లో పెట్టుకుంటోన్నారు. ఇందులో భాగంగానే ఆయన తన 170వ చిత్రాన్ని 'జై భీమ్' ఫేం టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో చేస్తున్నారు. మూడు నెలల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడింది. అలాగే, తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో వస్తున్న 'లాల్ సలామ్' మూవీలోనూ ఓ క్రేజీ రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు రజినీకాంత్ తన 171వ సినిమాను అధికారికంగా ప్రకటించారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ తన 171వ సినిమాను కోలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్తో చేయబోతున్నారు. దీనిపై తాజాగా చిత్ర యూనిట్ నుంచి ప్రకటన వెలువడింది. క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించబోతున్నాడు. అలాగే, ఈ సినిమాకు నేషనల్ అవార్డు విన్నింగ్ స్టంట్ కొరియోగ్రాఫర్ అన్బారివ్ యాక్షన్ డైరెక్టర్గా చేయబోతున్నారు. దీనిపై మరింత సమాచారం త్వరలోనే వెల్లడించబోతున్నారు.

ఇదిలా ఉండగా.. రజినీకాంత్తో తెరకెక్కించే చిత్రాన్ని సైతం లోకేష్ కనగరాజ్ తన గత చిత్రాల మాదిరిగానే యాక్షన్ జోనర్లో రూపొందించబోతున్నట్లు తెలిసింది. దీన్ని తన యూనివర్శ్కు జత చేసే విధంగా తెరకెక్కించనున్నాడట. క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై సౌతిండియా మొత్తంలో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











