సీఎం విజయ్పై రజనీకాంత్ కామెంట్స్.. స్టాలిన్తో భేటీకి కారణం అదే!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో తలైవా రజనీకాంత్ (rajinikanth) వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఎన్నికల్లో ఓడిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ను కలవడం, విజయ్ దళపతి ప్రమాణస్వీకారానికి ఆహ్వానించినా దూరంగా ఉండటం వంటి విషయాలపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విజయ్ పై అసూయ వల్లే ఇలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న ప్రచారాలపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో తనపై వస్తున్న రాజకీయ రూమర్లకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా హీరో విజయ్ సీఎం అయిన నేపథ్యంలో తాను అసూయ పడుతున్నానన్న ప్రచారం, అలాగే డీఎంకే-ఏఐఏడీఎంకే పార్టీల విలీనానికి ప్రయత్నించారన్న ఆరోపణలను ఆయన పూర్తిగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి.

ఇటీవల సోషల్ మీడియాలో 'విజయ్ సీఎం అవ్వకుండా అడ్డుకోవడానికి రజినీకాంత్ మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ను కలిశారు" అనే ప్రచారం వైరల్ అయింది. ఈ నేపథ్యంలో స్పందించిన రజినీకాంత్, "స్టాలిన్ నా మంచి స్నేహితుడు. ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత బాధతో ఆయనను పరామర్శించేందుకు మాత్రమే కలిశాను. దానికి రాజకీయ రంగు పూయడం సరికాదు" అని స్పష్టం చేశారు. ఎలాంటి దురుద్దేశం తనకు లేదని ఆయన తేల్చిచెప్పారు.
అదే విధంగా విజయ్పై వస్తున్న జెలసీ వ్యాఖ్యలను కూడా ఆయన ఖండించారు. "నేను రాజకీయాల్లో లేను. అలాంటప్పుడు విజయ్పై ఎందుకు అసూయ పడతాను?" అని ప్రశ్నించారు. ఒకవేళ కమల్ హాసన్ సీఎం అయితే బహుశా సరదాగా అసూయ పడతానేమో కానీ విజయ్ విషయంలో అలాంటిదేం లేదని నవ్వుతూ వ్యాఖ్యానించారు. "విజయ్తో నాకు 25 ఏళ్ల జనరేషన్ గ్యాప్ ఉంది. మేమిద్దరం పోటీ పడటం సరైనది కాదు" అని చెప్పారు.
విజయ్ రాజకీయ ప్రయాణంపై రజినీకాంత్ పాజిటివ్గా స్పందించడం విశేషం. "తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారు. అందుకే విజయ్ను గెలిపించారు. ఆయనపై నాకు ఎలాంటి ద్వేషం లేదు. భవిష్యత్తుపై చాలా అంచనాలు ఉన్నాయి" అంటూ అభినందనలు తెలిపారు. కేంద్రంలోని బీజేపీతో పాటు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు ఎదురు నిలిచి విజయ్ సాధించిన విజయాన్ని ఆయన ప్రశంసించారు.
ఇక తన రాజకీయ ప్రవేశంపై కూడా రజినీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'నేను 2021లో పార్టీ పెట్టి ఉంటే ఖచ్చితంగా గెలిచేవాడిని' అని ధీమా వ్యక్తం చేశారు. గతంలో పార్టీ ప్రకటించినప్పటికీ ఆరోగ్య కారణాలతో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మాత్రం రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు.
ఎయిర్పోర్ట్ ఘటనపై కూడా క్లారిటీ ఇచ్చారు. 'విజయ్ను నేను ముందే ట్విట్టర్ లో అభినందించాను. ఎయిర్పోర్ట్లో మీడియా లేకపోవడంతో మాట్లాడలేదు. ఒకరు ఫోన్లో వీడియో తీస్తూ సీఎం గురించి ప్రశ్న అడగడంతో కేవలం నవ్వి వెళ్లిపోయాను' అని చెప్పారు. దీనిని కూడా కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు.
తనపై వస్తున్న అన్ని రూమర్లకు రజినీకాంత్ ఒకేసారి క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లోకి రానని స్పష్టం చేస్తూనే, విజయ్పై ఎలాంటి అసూయ లేదని, స్టాలిన్ను కేవలం స్నేహితుడిగా మాత్రమే కలిశానని చెప్పడం ద్వారా పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, తమిళ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి.


Click it and Unblock the Notifications





