డబ్బు గుంజడానికే నాపై దావా వేసారు: రజనీకాంత్
హైదరాబాద్: సినీ ఫైనాన్షియర్ ముకుంద్ బోత్రాపై సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తన నుండి డబ్బు గుంజడానికే తనపై దావా వేసారంటూ ఆయన మండి పడ్డారు. తన వియ్యంకుడు కస్తూరి రాజా రూ. 65 లక్షలు ముకుంద్ బోత్రా వద్ద అప్పగా తీసుకున్నారని, ఆ అప్పుకు తాను హామీదారుగా లేక పోయినా తన నుండి ఆ డబ్బు వసూలు చేయడానికి దావా వేసారని తెలిపారు.
అయితే ఫైనాన్షియర్ ముకుంద్ బోత్రా వాదన మరోలా ఉంది. రజనీకాంత్ వియ్యంకుడు కస్తూరి రాజా 2012లో ఓ సినిమా విషయమై తన వద్ద ఒకసారి 40 లక్షలు, మరోసారి 25 లక్షలు అప్పుగా తీసుకున్నారని.... తాను డబ్బు చెల్లించక పోతే తన కుమారుడు ధనుష్ మామగారైన రజనీకాంత్ చెల్లిస్తాడని చెప్పారని, అందుకే దావా వేసారని తెలిపారు.

ఈ కేసులో కోర్టు పంపిన నోటీసులకు రజనీకాంత్ పై విధంగా సమాధానం ఇచ్చారు. ఈ కేసులో తన పేరు తొలగించాలని ఆయన హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. తన ప్రమేయం లేకున్నా తన పేరు చేర్చి తన పరువుకు నష్టం కలిగించారని రజనీకాంత్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











